సారాంశం
డిమాండ్ల సాధన కోసం నాలుగో దశ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లుగా తెలిపారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమం ఆగదని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 24న మహాసభలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిమాండ్ల సాధన కోసం నాలుగో దశ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లుగా తెలిపారు.
మే 27న ఏలూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు తరలివచ్చి జయప్రదం చేయాల్సిందిగా బొప్పరాజు కోరారు. తమ ఉద్యమంలో న్యాయం వుంది కాబట్టే ప్రభుత్వం స్పందిస్తోందని ఆయన పేర్కొన్నారు. పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమం ఆగదని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
ALso Read: కేబినెట్ సబ్ కమిటీతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ.. జీవో వచ్చే వరకు ఉద్యమం ఆగదు : తేల్చేసిన బొప్పరాజు
ఇకపోతే.. గత నెల 27న ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చట్టబద్ధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు. రూ.1800 కోట్ల బకాయిలు ఇవ్వాలన్న బొప్పరాజు.. అవి ఎప్పుడు చెల్లిస్తారో తెలియదన్నారు. పీఆర్సీ ఆరియర్లు కూడా ఎంత ఇవ్వాలో లెక్క చూస్తామని అధికారులు చెప్పారని వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్లో 16 శాతం హెచ్ఆర్ఏ ఉత్తర్వులు కోరామని.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు తమ ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదని బొప్పరాజు స్పష్టం చేశారు. తమ ఉద్యమం ఫలితంగానే ప్రభుత్వం రూ.5,860 కోట్ల బకాయిలు ఇచ్చిందని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రేపు జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశం యథావిధిగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు ఫలవంతంగా జరిగాయన్నారు. 3 వేల కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని మార్చిలో తెలిపిందని.. అయితే అంతకంటే ఎక్కువగానే రూ.5,820 కోట్లు చెల్లించిందని వెంకట్రామిరెడ్డి ప్రశంసించారు. పెండింగ్ డీఏ త్వరలోనే ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని.. త్వరలోనే జీవో వస్తుందని ఆయన ఆకాంక్షించారు. 2004కు ముందు రిక్రూట్ అయి తర్వాత విధుల్లో చేరిన వారిని ఓపీఎస్ కిందకు తీసుకుని వస్తామని కేబినెట్ సబ్ కమిటీ చెప్పిందని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని అడిగామని.. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా స్పందించిందని ఆయన చెప్పారు.