కేబినెట్ సబ్ కమిటీతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ.. జీవో వచ్చే వరకు ఉద్యమం ఆగదు : తేల్చేసిన బొప్పరాజు
చట్టబద్ధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు తమ ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదని బొప్పరాజు స్పష్టం చేశారు.
![amaravati jac chairman bopparaju venkateswarlu press meet after cabinet sub committee meeting ksp amaravati jac chairman bopparaju venkateswarlu press meet after cabinet sub committee meeting ksp](https://static-ai.asianetnews.com/images/01fpt5qzwev862dfmtxvxgns4m/bopparaju-new-jpg_363x203xt.jpg)
ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. డీఏలు, గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ , ఏరియర్స్, లివ్ ఎన్క్యాష్మెంట్పై చర్చ జరిగినట్లు తెలిపారు. అన్ని అంశాలకు టైం బాండ్ ఉందని.. వచ్చే నెల 1 నుంచి జీఓలు వస్తాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. కొత్త పీఆర్సీపై కూడా చర్చ జరిగిందని సీఎంతో చర్చించిన తర్వాత కొత్త పీఆర్సీ కమిటీపై ప్రకటన ఉంటుందని మంత్రి వెల్లడించారు. మాతో ఉన్న సంఘాలతో మాత్రమే సమావేశం జరిగిందని.. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు బయట మాట్లాడితే తాను స్పందించనని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
అనంతరం ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చట్టబద్ధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు. రూ.1800 కోట్ల బకాయిలు ఇవ్వాలన్న బొప్పరాజు.. అవి ఎప్పుడు చెల్లిస్తారో తెలియదన్నారు. పీఆర్సీ ఆరియర్లు కూడా ఎంత ఇవ్వాలో లెక్క చూస్తామని అధికారులు చెప్పారని వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్లో 16 శాతం హెచ్ఆర్ఏ ఉత్తర్వులు కోరామని.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు తమ ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదని బొప్పరాజు స్పష్టం చేశారు. తమ ఉద్యమం ఫలితంగానే ప్రభుత్వం రూ.5,860 కోట్ల బకాయిలు ఇచ్చిందని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రేపు జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశం యథావిధిగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దుకు నోటీస్: హైకోర్టులో సవాల్ చేసిన సూర్యనారాయణ
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు ఫలవంతంగా జరిగాయన్నారు. 3 వేల కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని మార్చిలో తెలిపిందని.. అయితే అంతకంటే ఎక్కువగానే రూ.5,820 కోట్లు చెల్లించిందని వెంకట్రామిరెడ్డి ప్రశంసించారు. పెండింగ్ డీఏ త్వరలోనే ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని.. త్వరలోనే జీవో వస్తుందని ఆయన ఆకాంక్షించారు. 2004కు ముందు రిక్రూట్ అయి తర్వాత విధుల్లో చేరిన వారిని ఓపీఎస్ కిందకు తీసుకుని వస్తామని కేబినెట్ సబ్ కమిటీ చెప్పిందని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని అడిగామని.. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా స్పందించిందని ఆయన చెప్పారు.