డేంజర్ జోన్ లో అమరావతి
- రాజధాని అమరావతి ప్రాంతం డేంజర్ జోన్లో ఉందంటూ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే ఓ మీడియా పెద్ద కథనాన్నే అచ్చేసింది.
- అదేంటంటే అమరావతికి భూ ప్రకంపనల ముప్పు పొంచి ఉందట.
- కొద్ది రోజులుగా రాజధాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
- అందుకనే, అమరావతి నిర్మాణానికి చంద్రబాబునాయకుడు ఎంపిక చేసిన ప్రాంతం అంత సేఫ్ కాదన్నట్లుగా కథనం ఉండటం విశేషం.
రాజధాని అమరావతి ప్రాంతం డేంజర్ జోన్లో ఉందంటూ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే ఓ మీడియా పెద్ద కథనాన్నే అచ్చేసింది. అదేంటంటే అమరావతికి భూ ప్రకంపనల ముప్పు పొంచి ఉందట. కొద్ది రోజులుగా రాజధాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే, అమరావతి నిర్మాణానికి చంద్రబాబునాయకుడు ఎంపిక చేసిన ప్రాంతం అంత సేఫ్ కాదన్నట్లుగా కథనం ఉండటం విశేషం. గడచిన నాలుగు రోజులుగా అమరావతి ప్రాంతంతో పాటు ఒంగోలు, కృష్ణా జిల్లాలోని గన్నవరం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించింది.
భూకంపాలు వచ్చే ఫ్రాంతాల్లో హైదరాబాద్ నగరం జోన్ -2లో ఉంటే, అమరావతి ప్రాంతం జోన్ -3లో ఉంది. జోన్ -3 అంటే ఓ మోస్తరు భూకంపాలు వచ్చే ప్రాంతమని అర్ధం. అంటే అమరావతికి ఎప్పటికైనా భూకంపాల ప్రమాదం పొంచి ఉన్నట్లే కదా? అదే విషయాన్ని పర్యావరణ వేత్తలు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. భూకంపాలే కాదు భారీ వర్షానికి కొండవీటి వాగు పొంగినా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం జలమయమైపోతాయని చెబుతున్నా చంద్రబాబు పట్టించుకోవటంలేదు. అమరావతి రాజధానిగా ఎంపికైన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనాల వల్ల ప్రమాదం మరింత పెరిగిందని సదరు మీడియా ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.
గురువారం కూడా గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాలైన దావాజీగూడెం, ముస్తాబాద, సూరంపల్లి, గోపవరపుగూడెం, బీబీగూడెం, గొల్లనపల్లి, తెంపల్లి, చిన అవుటపల్లి గ్రామాల్లో అనేకసార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గన్నవరంలోని రిక్టర్ స్కేల్ పై 5.1 గా నమోదైంది. మూడు రోజుల్లో గన్నవరం ప్రాంతంలో భూ ప్రకంపనలు రావటం రెండోసారి. మొత్తం మీద శాస్త్రజ్ఞులు ఎప్పటి నుండో మొత్తుకుంటున్న విషయాన్నే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే మీడియానే ప్రముఖంగా ప్రచురించటం ఆశ్చర్యంగా ఉంది.