గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు.. కీలక ఆదేశాలు..
అమరావతి రైతుల పాదయాత్ర రోజు ఉదయం జిల్లాలోని కౌతవరం నుంచి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. నేడు రైతుల పాదయాత్ర గుడివాడ మీదుగా సాగనుంది.
కృష్ణా జిల్లా గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం జిల్లాలోని కౌతవరం నుంచి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. గుడ్లవల్లేరు, అంగలూరు, గుడివాడ మీదుగా నాగవరప్పాడు వరకు దాదాపు 15 కి.మీ సాగనుంది. అయితే గుడివాడ రైతుల పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. కంకిపాడు మండలం దాములూరు టోల్గేట్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఐడీ కార్డులు ఉన్న రైతులనే పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతిస్తున్నారు.
ఈ క్రమంలోనే 20 మంది రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కంకిపాడు పీఎస్కు తరలించారు. అయితే ఐడీ కార్డుల పంపిణీ పూర్తికాకున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక, పోలీసులు గుడివాడ వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కంకిపాడు టోల్గేట్ దగ్గర మచిలీపట్నం మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో గద్దె అనురాధ వాగ్వాదానికి దిగారు. పాదయాత్రకు వస్తున్న స్పందనతో ప్రభుత్వం కావాలనే యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.