చిత్తూరు జిల్లాలో అమరరాజా గ్రూప్ కొత్త ప్లాంట్, ఆరు వేలమందికి ఉపాధి
ఇప్పటికే అమరరాజా గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్కు ఊరట కలిగింది. చిత్తూరు జిల్లాలో ఈ సంస్థ కొత్తగా ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది.
టీడీపీ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థ తెలంగాణలో లిథియం అయాన్ గిగా ఈవీ బ్యాటరీ తయారీ యూనిట్ స్థాపనకు అక్కడి ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పరిశ్రమలను తీసుకురావడానికి.. వున్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారంటూ విపక్షనేతలు విమర్శలు చేస్తున్నారు. దీనికి అధికార పక్షం కూడా అలాగే కౌంటర్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో అమరరాజా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద కొత్త తయారీ యూనిట్ను ప్రారంభించబోతోంది. అమరరాజా గ్రూపులోని మంగళ్ ఇండస్ట్రీస్ రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 2.15 లక్షల అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. ఇక్కడ బ్యాటరీ కాంపొనెంట్స్, టూల్ వర్క్స్, మెటల్ ఫ్యాబ్రికేషన్స్, ఆటో కాంపొనెంట్స్ను తయారు చేసే అవకాశం వుంది. వీటిని దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా అమరరాజా అధినేత గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు తాము కట్టుబడి వున్నామని తెలిపారు. ప్లాంట్లను విస్తరించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని గల్లా జయదేవ్ వెల్లడించారు. తేనిపల్లిలో ఏర్పాటు చేసే ప్లాంట్ ద్వారా మరో వెయ్యి ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు.