Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో అమరరాజా ఫ్యాక్టరీ .. సొంత ఎంపీతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించలేడా : బాబుపై విజయసాయి ఫైర్

అమరరాజా సంస్థ తెలంగాణలో ఫ్యాక్టరీ పెడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. సొంత పార్టీ ఎంపీతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించలేడా అని ప్రశ్నించారు. 

ysrcp mp vijayasai reddy fires on tdp chief chandrababu naidu over amara raja group to set up battery factory in telangana
Author
First Published Dec 3, 2022, 5:57 PM IST

టీడీపీ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థ తెలంగాణలో లిథియం అయాన్ గిగా ఈవీ బ్యాటరీ తయారీ యూనిట్‌ స్థాపనకు అక్కడి ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పరిశ్రమలను తీసుకురావడానికి.. వున్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారంటూ విపక్షనేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తన పార్టీకే చెందిన ఎంపీతో తన సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించలేని చంద్రబాబు... రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావాలని ఎలా అంటారు అంటూ మండిపడ్డారు. తెలంగాణలో రూ.9,500 కోట్ల భారీ పెట్టుబడితో అమరరాజా గ్రూప్ ప్లాంట్ పెడుతుండటం టీడీపీ నేతల అవకాశవాదానికి నిదర్శనమన్నారు. 

ఇకపోతే.. ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం రోజూ జగన్ ఫోటోకి దండం పెడుతోందని సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేయాలంటూ జగన్ బీనామీలైనా కావాలని లేదంటే, ఆయన మనుషులకు వాటాలైనా ఇవ్వాల్సి వుంటుందని ధూళిపాళ్ల దుయ్యబట్టారు. ప్రభుత్వ వేధింపులకు తోడు, అధికార పార్టీ నేతల వసూళ్లకు భయపడి పారిశ్రామికవేత్తలు ఏపీని వీడుతున్నారని నరేంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో క్యాపిటల్ ఇన్‌ఫ్లోకు బదులు.. క్యాపిటల్ రివర్స్‌ఫ్లో జరుగుతోందని ధ్వజమెత్తారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానానికి పడిపోవడం సిగ్గుచేట్టన్న ఆయన.. ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్న వారిని బెదిరించడం, లేదా వారి వ్యాపారాన్ని లాక్కోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని నరేంద్ర విమర్శించారు. 

ALso REad:ఏపీ నుంచి తరలిపోతున్న పరిశ్రమలు.. తెలంగాణ సర్కార్ రోజూ జగన్‌కి దండం పెడుతోంది : ధూళిపాళ్ల సెటైర్లు

అంతకుముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయనే ప్రచారం అవాస్తమన్నారు. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్టా అని ప్రశ్నించారు. అమరరాజా కంపెనీ రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంటే.. ఏపీ నుంచి ఆ కంపెనీని వెళ్లగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని దుష్ప్రచారం  చేస్తున్నారని మండిపడ్డారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios