వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్: మంత్రాంగం ఆ ఇద్దరిదే
ఇద్దరు నేతలు ఆమంచిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ప్రోత్సహించినట్లు సమాచారం. ఇకపోతే ఆమంచి కృష్ణమోహన్ కు మాజీమంత్రి, కందుకూరు వైసీపీ సమన్వయకర్త మానుగుంట మహీధర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి.
ప్రకాశం: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. చీరాల నియోజకవర్గంపై ఆమంచికి మంచి పట్టు ఉంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ప్రజలు బ్రహ్మరథం పడతారంటే అందుకు నిదర్శనమే అది.
అయితే ఆమంచి కృష్ణమోహన్ అధికార పార్టీ తెలుగుదేశం వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై చాలా పెద్ద ప్లాన్ ఉందని తెలుస్తోంది. ఆమంచిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేసింది సీనియర్ రాజకీయవేత్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి మానుగుంట మహీధర్రెడ్డి అని ప్రచారం జరుగుతుంది.
ఇద్దరు నేతలు ఆమంచిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ప్రోత్సహించినట్లు సమాచారం. ఇకపోతే ఆమంచి కృష్ణమోహన్ కు మాజీమంత్రి, కందుకూరు వైసీపీ సమన్వయకర్త మానుగుంట మహీధర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి.
మహీధర్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆమంచి కృష్ణమోహన్ ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగారని ప్రచారం. ఇకపోతే వైఎస్ జగన్ తో భేటీ అయిన తర్వాత డా.దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో భేటీ అయ్యారు. భేటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలిసింది. ఆతర్వాతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రకాశం జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు.