ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరు మార్పు అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. జిల్లా పేరు మార్చవద్దని కొందరు ఆందోళనకారులు.. మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు నిప్పుపెట్టారు. అయితే తన ఇంటిపై జరిగిన దాడిపై ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు కొందరు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న పొన్నాడ సతీష్ ఇంటి వద్దకు చేరుకున్న ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఆ తర్వాత ఇంటికి నిప్పుపెట్టారు. అయితే ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న సతీష్ కుమార్ కుటుంబ సభ్యులను పోలీసులు రక్షించారు. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం పొన్నాడ సతీష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను అక్కడి నుంచి తరలించారు. 

అయితే ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్.. పోలీసులు రాకపోతే తన కుటుంబం సజీవ దహనం అయ్యేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సాక్షి మీడియా కథనం ప్రచురించింది. ‘‘నేను, నాకుటుంబం ఇంటి పై అంతస్తులో ఉన్నాం. ఆ సమయంలో ఆందోళన కారులు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిప్పు పెట్టారు. బయటకు వచ్చేసరికి ఇల్లు మంటల్లో ఉంది. ఆసమయంలో పోలీసులు, ముఖ్యంగా డీఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. తక్షణమే నన్ను, నా భార్య, కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చి రక్షించారు. లేకపోతే నా కుంటుంబ ఆ మంటల్లో సజీవ దహనం అయ్యేది’’ అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెప్పారు.

ఈ హింస వెనక కచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర ఉందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు వెనక ఉండి వారి కార్యకర్తలను ఉసిగొల్పి పక్కా పథకంతో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. పెట్రోల్‌ డబ్బాలతో వచ్చి ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేసి నిప్పు పెట్టారంటే ఎంతటి పక్కా ప్రణాళికతో వచ్చారో అర్థం అవుతోందన్నారు. 

కొనసాగుతున్న టెన్షన్..
ప్రస్తుతం కోనసీమలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అమలాపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ పికెట్లను ఏర్పాట్లు చేశారు. నిన్నటి ఘటనల దృష్ట్యా కొనసీమకు ఇతర జిల్లాల నుంచి కూడా బలగాలను రప్పించారు. సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యతలను సీనియర్ ఐపీఎస్‌లకు బాధ్యతలు అప్పగించారు. కోనసీమలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఏలూరు డీఐజీ పాలరాజు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మళ్లీ ఆందోళనలు జరిగే అవకాశం ఉండొచ్చనే అనుమానంతో.. అమలాపురం మొత్తం పోలీసుల నిఘా నీడలోకి వెళ్లింది. 

అమలాపురం డిపో నుంచి సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. అలాగే కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమకు బస్సు సర్వీసులు రద్దు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అమలాపురం వచ్చే బస్సులను కూడా నిలిపివేశారు. ఇక, ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కోనసీమ జిల్లా సాధనసమితి చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 

ఇంటర్‌నెట్ సేవలు బంద్..
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించిన ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. సామాజిక మాద్యమాల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేలా ఈ చర్యలు చేపట్టారు. నిన్న జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. పరిస్థితులు చక్కబడేవరకు ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

పరిస్థితి అదుపులో ఉంది.. డీఐజీ పాలరాజ్
నిన్నటి అల్లర్లకు కారణమైన వారిని కొందరిని గుర్తించామని డీఐజీ పాలరాజ్ చెప్పారు. అమలాపురం పూర్తిగా పోలీసుల ఆధీనంలోనే ఉందని చెప్పారు. పుకార్లను ఎవరూ నమ్మవద్దని కోరారు. హింసాత్మక సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.