ప్రశ్నపత్రాల లీకుల గురించి రాష్ట్రంలో ఇంత గోల జరుగుతున్నా మరి విద్యాశాఖ ఉన్నతాధికారులు గానీ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు
లీకుల సీజన్ ఊపందుకున్నది. మరో రెండు రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ముగింపుకొచ్చాయి. మొదటి రోజు మొదలైన ప్రశ్నాపత్రాల లీకులు పరీక్షలు చివరికొచ్చేసరికి బాగా ఊపందుకున్నాయి. సైన్స్ పేపర్ లీక్, తెలుగు క్వశ్చన్ పేపర్ లీక్, హిందీ పేపర్ బయటకు వచ్చేసింది. ఇలా పరీక్ష ఏదైనా కానీ పోటీ పడి మరీ పేపర్లు లీక్ అయిపోతున్నాయి. అయినా ప్రభుత్వం తరపున వివరణ కానీ చర్యలు కానీ పూజ్యం. క్వశ్చన్ పేపర్లు లీకవుతున్నాయని గగ్గోలు పెడుతున్నా పట్టించుకున్న వాళ్ళు లేరు.
మంత్రి నారాయణ జిల్లా నెల్లూరులోనే సైన్స్ పేపర్ మొదటి పేపర్ లీక్ అయిందని ప్రచారం జరుగుతున్న ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత వంతు మడకశిరది. పరీక్ష మొదలుకాకముందే కదిరిలో హిందీ పేపర్ బయటకు వచ్చేసిందని గోల జరుగుతోంది. అయినా విచారణ లేదు. ప్రశ్నలు-జవాబులు ఏకంగా వాట్సప్ లోనే ప్రత్యక్షమవుతున్నట్లు సమాచారం. ఎవరో కొద్ది మంది విద్యార్ధుల కారణంగా లక్షలాది మంది విద్యార్ధల భవిష్యత్తు దెబ్బతింటోంది. ఏడాదంతా కష్టపడి చదివి మంచిమార్కులు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న విద్యార్ధులకు లీకుల పర్వం పెద్ద ఇబ్బందిగా మారుతోంది. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవటం ఆశ్చర్యరంగా ఉంది.
ఇప్పటి వరకూ జరిగినట్లు ప్రచారంలో ఉన్న ప్రశ్నపత్రాల లీకులన్నీ ఓ కార్పొరేట్ విద్యా సంస్ధ నుండే జరుగుతోందని కూడా ప్రచారంలో ఉంది. అయితే, సదరు కార్పొరేట్ విద్యాసంస్ధల యజమాని ఓ మంత్రి కావటం గమనార్హం. ప్రశ్నపత్రాల లీకుల గురించి రాష్ట్రంలో ఇంత గోల జరుగుతున్నా మరి విద్యాశాఖ ఉన్నతాధికారులు గానీ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు
