ప్రియురాలిని చంపి సూసైడ్ చేసుకొన్న లవర్


పోలవరం:పశ్చిమగోదావరి జిల్లా పోలవరం బాపూజీ కాలనీలో  ప్రియురాలిని  చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఈ ఘటనతో పోలవరంలో విషాదం నెలకొంది. 

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన లహరి, కిరణ్‌లుగా పోలీసులు గుర్తించారు. పోలవరంలోని బట్టల దుకాణంలో లహరి పనిచేస్తోంది.  కిరణ్ ఆటో నడుపుతున్నాడు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. 

అయితే వీరిద్దరి మధ్య  కొంతకాలం క్రితం నుండి మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. కిరణ్‌తో దూరంగా ఉంటున్న లహరి సురేష్ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది.  వీరిద్దరూ కూడ పెళ్ళి చేసుకోవాలని భావించారు. దీంతో ఇంట్లో నుండి  లహరి బుధవారం ఉదయం పారిపోయింది. 

ఈ విషయం తెలుసుకొన్న లహరి కుటుంబసభ్యులు ఆమెను వెతుక్కొంటూ వెళ్ళారు.  పోలవరంలో లహరి ఉన్న విషయం తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళారు. అయితే లహరి సురేష్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకొంటుందనే విషయం తెలిసిన మాజీ ప్రియుడు కిరణ్ తెల్లవారుజామునే పోలవరం చేరుకొన్నాడు.

లహరి ఎక్కడ ఉందో తెలుసుకోని ఆమెను విచక్షణరహితంగా కత్తితో పొడిచాడు.  అయితే అక్కడే ఉన్న లహరి కుటుంబసభ్యులు కిరణ్ ను అడ్డుకోబోయారు. వారిపై కూడ అతను దాడికి పాల్పడ్డాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన లహరి అక్కడికక్కడే మృతి చెందింది.  కిరణ్ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.