చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలు.. హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్.. రేపు విచారణ..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల వ్యవహారంలో క్రిమినల్ కంటెంప్ట్ను హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఈరోజు మెన్షన్ చేశారు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఏజీ కోరారు. అయితే ఈ పిటిషన్ను రేపు విచారిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. ఇక, జడ్జిలపై దూషణల వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇక, చంద్రబాబు నాయుడును నిందితుడిగా పేర్కొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు విచారిస్తున్నారు. అయితే చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ జడ్జి హిమబిందు ఉత్తర్వులు వెలువరించిన తర్వాత ఆమెను కించపరుస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కొందరు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. జడ్జి హిమబిందుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టుల వల్ల ఆమె హోదా, గౌరవాన్ని కించపరిచినట్టుగా అవుతుందని ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. బాధ్యతయుతంగా విధులు నిర్వర్తిస్తున్న జడ్జి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని.. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా స్పందించారు. ఈ క్రమంలోనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో జడ్జి హిమబిందుపై వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని పీసీ మీనా ఆదేశించారు. ఈ మేరకు తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు వివరించాలని లేఖ రాశారు.