జెసి దివాకర్ రెడ్డికి ఆదినారాయణ రెడ్డి షాక్
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి ఆ పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి షాక్ ఇచ్చారు.
కడప: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి ఆ పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి షాక్ ఇచ్చారు. ఉక్కు కర్మాగారం కోసం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చేస్తున్న దీక్షపై జేసి చేసిన సంచలన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.
దీక్షల వల్ల ఉక్కు పరిశ్రమ.. తుక్కు ఏదీ రాదని జెసి అన్నారు. మోడీపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందించారు. ఇప్పటికే రాష్ట్రం పట్ల కేంద్రం వ్యతిరేకంగా ఉందని, ఇలాంటి సందర్భాల్లో మరింత నిరాశపరిచేలా జేసీ మాట్లాడటం తగదని ఆయన అన్నారు.
జెసి దివాకర్ రెడ్డి మాటలు ఎవరూ పట్టించుకోవద్దని మంత్రి ఆది పిలుపునిచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. కడప పౌరుషమేంటో చూపిస్తామని, రానున్న ఎన్నికల్లో బీజేపి, వైసీపీలను ప్రజలు తుంగలో తొక్కుతారని ఆయన అన్నారు.