హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా మొదలవ్వనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సు అసలు జరగాల్సింది విశాఖపట్నంలోనే అట.

హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా మొదలవ్వనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సు అసలు జరగాల్సింది విశాఖపట్నంలోనే అట. కాకపోతే కొన్ని కారణాల వల్ల చివరి నిముషంలో వేదిక విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు మారింది. ఇండియాలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందని తెలిసినప్పటి నుండి సమ్మిట్ ను ఏపిలో నిర్వహించేందుకు ఉన్నతాధికారులు చాలా ప్రయత్నాలే చేశారు. ఏపి మాదిరే ఢిల్లీ, తెలంగాణా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఏపి నుండి ఎపి ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి జాస్తి కృష్ణ కిషోర్ పెద్ద ప్రయత్నాలే చేశారు. కానీ సాధ్యం కాలేదు. అమెరికాకు వెళ్ళి సమ్మిట్ నిర్వాహకులతో పాటు ఇవాంకా ట్రంప్ బృందాన్ని కూడా కలిసారు. సమ్మిట్ ను విశాఖపట్నంలోనే ఎందుకు జరపాలి ? జరపటానికి ఉన్న అవకాశాలేంటి అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. ఒకదశలో ఇవాంకా బృందంలోని కీలక వ్యక్తులు కూడా విశాఖవైపే మొగ్గుచూపారట.

అయితే, చివరి నిముషంలో విశాఖలో సమ్మిట్ జరగటానికి అంగీకరించలేదట. అందుకు ప్రధాన కారణమేంటంటే, బస, వసతి చాలినంతగా లేకపోవటమే. మూడు రోజుల సమ్మిట్ కు ప్రపంచదేశాల నుండి సుమారు 1500 మంది ప్రతినిధులు హాజరవుతారు. వీరందరూ ఐదు, నాలుగు నక్షత్రాల స్ధాయి హోటోళ్ళల్లో తప్ప దిగరు.

ప్రతినిధులకు, నిర్వాహకులకు మొత్తం మీద 2 వేల గదులు అవసరం. అన్ని గదులు విశాఖపట్నంలో అందుబాటులో లేవన్నది వాస్తవం. అదే సమయంలో నిర్వాహకులకు హైదరాబాద్ తెలిసినంతగా విశాఖపట్నం తెలీదు. దానికితోడు హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రమం కూడా సమ్మిట్ నిర్వహణకు కలసివచ్చింది. అందుకని నిర్వాహకులు హైదరాబాద్ వైపు మొగ్గుచూపారు. దాంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే అవకాశం విశాఖపట్నంకు తృటిలో తప్పిపోయింది.