బాలయ్య జోలికి వస్తే.. ఊరుకోం
బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య అభిమానులు
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆయన అభిమానులు మద్దతుగా నిలిచారు. ఇటీవల చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న బాలయ్య.. రాష్ట్రానికి హోదా విషయంలో ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. అంతేకాకుండా ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో.. బీజేపీ నేతలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. బాలయ్య వెంటనే మోదీకి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. బాలకృష్ణ దిష్టిబొమ్మలు దహనం చేయడం, ఆయనపై గవర్నర్ కి ఫిర్యాదు చేయడం లాంటి చర్యలు చేపట్టారు
కాగా.. ఈ విషయంలో బాలయ్యకు ఆయన అభిమానులు అండగా నిలిచారు. భజన హామీలు అమలు చేయకుండా ఐదుకోట్ల ఆంధ్రులకు అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీపై సహేతకమైన ఆరోపణలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై బీజేపీ నేతలు రాద్దాంతం చేయడం సిగ్గుచేటని బాలకృష్ణ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యుడు పి.పీరయ్య మండిపడ్డారు.
బాలకృష్ణ సీఎం చంద్రబాబుకు వియ్యంకుడు మాత్రమే కాదని, ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అన్న సంగతి బీజేపీ నేతలు తెలుసుకోవాలన్నారు. ఆయన ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో మోదీ ఏపీకి ఏం చేశారని ధర్మపోరాట దీక్షలో బాలకృష్ణ అన్నారని, ఆయన ఎక్కడో దాక్కుని, దొంగచాటుగా చెప్పలేదని వేదిక నుంచి వేలాది మంది ప్రజలు పాల్గొన్న సమావేశంలో చెప్పారన్నారు.
అయితే ఢిల్లీలో ఉన్న మోదీ మెప్పుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం, గవర్నర్కు ఫిర్యాదు, పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేస్తూ పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాలరాస్తున్న ప్రధానిమోదీ, కేంద్ర ప్రభుత్వంపై వాస్తవాలతో కూడిన ఆరోపణలు చేసిన బాలకృష్ణకు మద్దతు ఇవ్వాల్సిన రాష్ట్ర బీజేపీ నేతలు మోదీకి మోకరిల్లడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. ఇప్పటికైనా చేసిన పిచ్చిపనులకు బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బాలకృష్ణ అభిమాన సంఘం సభ్యులు ఇబ్రహీం, యుగంధర్నాయుడు తదతరులు పాల్గొన్నారు.