చిత్తూరులో అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్య
చిత్తూరు జిల్లాలో ఓ ఆధ్యాత్మికవేత్త దారుణహత్యకు గురయ్యారు. ఐరాల మండలం గుండ్లపల్లె సమీపంలోని శ్రీరామతీర్థ సేవాశ్రమంలో అచ్యుతానందగిరి స్వామిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటనతో మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆశ్రమ సహాయకురాలు లక్ష్మమ్మ, పోలీసులు ఆయన గురించి వివరాలు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ఓ ఆధ్యాత్మికవేత్త దారుణహత్యకు గురయ్యారు. ఐరాల మండలం గుండ్లపల్లె సమీపంలోని శ్రీరామతీర్థ సేవాశ్రమంలో అచ్యుతానందగిరి స్వామిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటనతో మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆశ్రమ సహాయకురాలు లక్ష్మమ్మ, పోలీసులు ఆయన గురించి వివరాలు తెలిపారు.
అచ్చుతానందగిరి స్వామి శ్రీరామతీర్థ సేవాశ్రమ బాధ్యతలను నలభై ఏళ్లుగా చూసుకుంటున్నారు. శ్రీరామతీర్థ సేవాశ్రమం దాదాపు 60 యేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. తవణంపల్లె మండలం దిగువమాఘం గ్రామానికి చెందిన ఈయన అసలు పేరు ఎం.పూర్ణచంద్రారెడ్డి. ఇరవై ఏళ్ల వయసులో పరిపూర్ణానంద స్వామి దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు ఆశ్రమాలలో గడిపి శ్రీరామతీర్థ సేవాశ్రమానికి చేరుకున్నారు.
ఆశ్రమంలోని శివాలయంలో నిత్యం పూజలు చేసేవారు. లక్ష్మమ్మ అనే వృద్ధురాలు సహాయకారిగా ఉండేవారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఓ ఆగంతకుడు ఆశ్రమంలోకి చొరబడి భోజనం చేస్తున్న అచ్యుతానందగిరి స్వామిపై దాడి చేశాడు. ఆ చప్పుడు విని అక్కడకు వచ్చిన లక్ష్మమ్మ కూడా బెదిరించాడు. ఆమె భయంతో పారిపోయి చెట్ల మధ్య దాక్కుని, అక్కడే ఉండిపోయింది. బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి అచ్యుతానందగిరి స్వామి చనిపోయి ఉన్నారు.
ఈ ఘటనపై అచ్యుతానందగిరి స్వామి అన్న శ్రీరాములురెడ్డి మాట్లాడుతూ తన తమ్ముడు ఇటీవల పూతలపట్టు మండలం మిట్టూరు వద్ద ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడని, విక్రయించిన వ్యక్తి ఇప్పటివరకు దానిని అప్పగించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
ఆశ్రమానికి చెందిన రెండు సెల్ ఫోన్లను ఆగంతకుడు తీసుకెళ్లినట్లు తెలిసింది. సంఘటనా స్థలంలో పోలీసులకు ఓ పర్సు, మొబైల్ లభించినట్లు తెలిసింది. డాగ్ స్వాడ్ ఆశ్రమం నుంచి కొద్ది దూరంలోని పెట్రోల్ బంక్ వరకు వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనపై డీఎస్పీ సుధాకరరెడ్డి మాట్లాడుతూ ఆగంతకుడు తీసుకెళ్లిన మొబైల్ ఫోన్ కల్లూరు పరిసరాల్లో స్విచ్ఛాఫ్ అయిందని తెలిపారు.