ఎఫ్ఐఆర్లో పేరు లేకుంటే తప్పు చేయనట్లు కాదు.. దర్యాప్తులో చంద్రబాబు పాత్ర వెలుగులోకి : పొన్నవోలు
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు పూర్తి భద్రత వుందన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోతే తప్పు చేయలేదని కాదని సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో వెల్లడైన ఆధారాల ఆధారంగానే ఆయన పేరును చేర్చామన్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు పూర్తి భద్రత వుందన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కావాల్సిన మందులు, ఆహారం అందుతున్నాయన్నారు. చంద్రబాబు విన్నపాలను పరిగణనలోనికి తీసుకున్నామని.. చట్టం ముందు అందరూ సమానమేనని పొన్నవోలు పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు అనుమతి లేనిదే ఆయన బ్లాక్కు ఎవరూ వెళ్లలేరని పొన్నవోలు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పర్యవేక్షణకు డాక్టర్లు అందుబాటులో వుంటారని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఆర్పీసీ చట్టంలో హౌస్ అరెస్ట్ అనేది లేదని.. రాజమండ్రి జైలులో కట్టుదిట్టమైన భద్రత వుందని పొన్నవోలు పేర్కొన్నారు. ప్రైవేట్ హౌస్లో ఇంత భద్రత సాధ్యం కాదని.. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోతే తప్పు చేయలేదని కాదని సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాత్ర దర్యాప్తులో బయటపడిందని.. దర్యాప్తులో వెల్లడైన ఆధారాల ఆధారంగానే ఆయన పేరును చేర్చామన్నారు.
కాగా.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్ట్ కొట్టివేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఎలాంటి ముప్పు లేదన్న సీఐడీ వాదనలతో ఏసీబీ కోర్ట్ ఏకీభవించింది. భద్రతపై చంద్రబాబు తరపు లాయర్లు చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోనికి తీసుకోలేదు.
అయితే ఈ పరిస్థితుల వేళ జైళ్ల శాఖ డీజీ హరీష్ కుమార్ గుప్తా అడ్వొకేట్ జనరల్కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. సోమవారం(సెప్టెంబర్ 11)న ఆయన ఈ లేఖ రాశారు. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని జైళ్ల శాఖ డీజీ అందులో పేర్కొన్నారు. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో అన్ని రకాల వసతులతో కూడిన స్పెషల్ వార్డు కేటాయించామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బ్లాక్ శానిటైజ్ చేశామని తెలిపారు. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించామని చెప్పారు.
ALso Read: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం : చంద్రబాబుకు మరో షాక్.. హౌస్ కస్టడీ పిటిషన్ కొట్టివేసిన కోర్ట్
చంద్రబాబు ఉన్న బ్లాక్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. స్పెషల్ వార్డు ముందు ప్రత్యేక వైద్య బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించినట్టే అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. కేవలం చంద్రబాబు అనుమతిస్తేనే ఎవరికైనా ఎంట్రీక కల్పిస్తున్నామని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అక్కడి భద్రతను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఇక, జైళ్ల శాఖ డీజీ నుంచి వచ్చిన ఈ లేఖను.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్పై విచారణ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమర్పించినట్టుగా సమాచారం.