మన్యం జిల్లాలో బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.50లక్షల ఆస్తినష్టం...
పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బైక్ షోరూంలో ఏర్పడిన మంటల్లో సుమారు రూ.50లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా.
పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో గల బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి ధమాకా అమ్మకాలకు తెచ్చిన బ్యాటరీ బైక్ లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణం అని యజమానులు అంటున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో యాభై లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.
ఇదిలా ఉండగా, ఆదివారం విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ దారుణం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీపావళి సందర్భంగా విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో బాణసంచా దుకాణం ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు ఉదయం ఈ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దుకాణంలోని బాణాసంచా పేలింది. దీంతో బాణసంచా కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులతో పాటు అక్కడే ఉన్నవారంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ బాణసంచా దుకాణం పక్కనే పెట్రోల్ బంక్ ఉంది.
చనిపోయడని యువకుడికి అంత్యక్రియలు.. చిన్నకర్మ రోజు ఇంటికి వచ్చిన కొడుకు...ఏం జరిగిందో తెలియక...
బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అగ్నిప్రమాదం కారణంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు బాణసంచా దుకాణలు పూర్తిగా దగ్దమయ్యాయి. బాణసంచా దుకాణంలో పని చేస్తున్న ఇద్దరు సజీవ దహనమైనట్టుగా పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిని విజయవాడకు చెందిన కాశీ, పిడుగురాళ్లకు చెందిన సాంబగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ టపాసుల దుకాణంలో పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా చెప్పారు. ఫైర్ నిబంధనలు పాటించిన వారికే బాణసంచా దుకాణాలకు అనుమతి ఇచ్చినట్టుగా సీపీ చెప్పారు. టపాకాయలు దిగుమతి చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని సీపీ వివరించారు.