చిన్నారి ప్రాణాలు బలితీసుకున్న నిమ్మకాయ ... ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది....
గొంతులో నిమ్మకాయ ఇరుక్కుపోయి ముక్కుపచ్చలారని చిన్నారి మృతిచెందిన హృదయవిధారక ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.
![9 months Child death due to lemon stuck in throat at Anantapur District AKP 9 months Child death due to lemon stuck in throat at Anantapur District AKP](https://static-ai.asianetnews.com/images/01geh3h2jshtvbv8b2f4ekefn4/india-female-imr-drops-to-same-level-as-males_363x203xt.jpg)
అనంతపురం : ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఆ దంపతులకు సంతానం కలిగింది. ఆ మహాలక్ష్మే తమ ఇంటికి బిడ్డరూపంలో వచ్చిందని తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. కానీ వారి సంతోషం ఎక్కువరోజులు నిలవలేదు... అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అనుకోకుండా ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిధారక ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... పెద్దవవడుగూరు మండలం మల్లేనిపల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ సకిదీప, గోవిందరాజు భార్యాభర్తలు. వీరికి పెళ్లయిన ఏడేళ్ల తర్వాత సంతానం కలిగింది... ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇలా ఎంతో ప్రేమగా చూసుకుంటున్న చిన్నారి అనుకోకుండా ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయింది.
ఇంటిబయట ఆడుకుంటున్న చిన్నారి అశ్విత (9నెలలు) నిమ్మకాయను మింగేసింది. దీంతో అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తల్లి ఎంత ప్రయత్నించినా చిన్నారి గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయ బయటకు రాలేదు. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు అశ్వితను పెద్దవడుగూరు హాస్పిటల్ కు తరలించారు. కానీ హాస్పిటల్ కు వెళ్ళేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న చిన్నారి హటాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డ మృతదేహాన్ని గుండెలకు హత్తుకుని ఆ తల్లి రోదించడం చూసేవారికీ కన్నీరు తెప్పించింది. అశ్విత మృతితో మల్లేనిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.