ప్రొద్దుటూరులో ఐటీ శాఖ తనిఖీలు .. 300 కేజీల బంగారం సీజ్, తోటి వ్యాపారుల్లో టెన్షన్
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి . ఈ తనిఖీల్లో ఏకంగా 300 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు . పండుగ సీజన్లో గోల్డ్ షాపులు మూతపడటంతో వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. ఈ తనిఖీల్లో ఏకంగా 300 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారానికి సంబంధించి బిల్లులు లేకపోవడంతోనే అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ, తిరుపతికి చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని పలు జ్యూవెలర్స్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిని తిరుపతికి తరలించారు.
ఇకపోతే బులియన్, ఆభరణాల తయారీలో ప్రొద్దుటూరుకు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వుంది. అందుకే ఈ పట్టణాన్ని రెండో ముంబైగా పిలుస్తారు. కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతూ వుండటంతో అధికారులు నిఘా పెట్టారు. ప్రొద్దుటూరులో 2 వేలకు పైగా గోల్డ్ షాపులు వున్నట్లుగా అంచనా. ఇలాంటి పరిస్ధితుల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. పండుగ సీజన్లో గోల్డ్ షాపులు మూతపడటంతో వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు.