Asianet News TeluguAsianet News Telugu

YS Jagan - KCR: కేసీఆర్‌, జగన్ భేటీలో ఏం జరిగింది?.. అందుకే మూడు రాజధానులపై జగన్ వెనక్కి తగ్గారా..?

మూడు రాజధానుల  బిల్లు (Three Capitals Bill) ఉపసంహరణ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) తీసుకున్న నిర్ణయం.. సోమవారం ఉదయం వరకు కూడా చాలా మంది ఏపీ మంత్రులకు (AP Ministers) తెలియదు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR)తో భేటీ జరిగిన మరసటి రోజే ఇలాంటి నిర్ణయం వెలువడం ఇప్పుడు  హాట్ టాపిక్‌గా మారింది. 

3 capitals bill withdrawal what KCR And Jagan Discuss About This
Author
Amaravati, First Published Nov 23, 2021, 10:44 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (ys jagan mohan reddy).. మూడు రాజధానుల విషయాన్ని చాలా కీలకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు సంబంధించి శాసన మండలిలో పెద్ద యుద్దమే చేసిందని చెప్పాలి. అమరావతి రైతులు నెలల తరబడి పోరాటం చేస్తున్న.. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్ని విమర్శలు వచ్చిన జగన్ వాటిని లెక్కచేయకుండా.. ఈ అంశంపై ముందుకు సాగారు. కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలనే సంకల్పాన్ని మాత్రం జగన్ విడిచిపెట్టలేదు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా జగన్.. మూడు రాజధానుల బిల్లు(Three Capitals Bill) విషయంలో వెనక్కి తగ్గారు. సమగ్రమైన బిల్లు తీసుకొస్తామని చెప్పినప్పటికీ దానిని ఒక టైమ్ ఫ్రేమ్ అనేది వెల్లడించలేదు. కాబట్టి ఇప్పట్లో మూడు రాజధానుల అంశం అనేది కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్నట్టేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం.. నిన్న ఉదయం వరకు కూడా చాలా మంది మంత్రులకు తెలియదు. కేబినెట్ భేటీకి హాజరైన మంత్రులు జగన్ నిర్ణయం విని షాక్ తిన్నారు. ఇన్నాళ్లు మూడు రాజధానులపై బలంగా ఉన్న జగన్.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని మంత్రులతో పాటుగా, వైసీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్‌లు (kcr and jagan meet) ఓ వివాహ వేడుకలో కలిసి మాట్లాడుకున్న మరుసటి రోజే.. Jagan మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరణ గురించిన నిర్ణయాన్ని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గత 10 రోజులుగా తెర వెనక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.  

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి నవంబర్ 13న అమరావతి చేరుకన్నారు. అంతేకాకుండా నెల్లూరులో జరిగిన స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమాలల్లో పాల్గొన్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు.. రెగ్యూలర్ ప్రాసెస్‌లో భాగంగా కేంద్ర నిఘా వర్గాలు తిరుపతి, నెల్లూరుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో మూడు రోజుల ముందు నుంచే మకాం వేశాయి. అయితే అంతకు కొద్ది రోజుల ముందే అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రను (amaravati farmers padayatra) చేపట్టారు. ఆ పాదయాత్రలో జరుగుతున్న పరిణామాలను నిఘా వర్గాలు కేంద్రానికి రిపోర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. 

మరోవైపు తిరుపతి (tirupati) పర్యటనకు వచ్చిన అమిత్ షా.. ఏపీ బీజేపీ నేతలకు అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలనే ఆదేశాలు జారీచేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు అమరావతి రైతులకు మద్దతు తెలపడమే కాకుండా.. వారి పాదయాత్రలో పాల్గొన్ని సంఘీభావం కూడా తెలిపారు. ఇన్నాళ్లు అమరావతిపై సరైన స్పష్టత ఇవన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు సడన్‌గా రైతులకు మద్దతు తెలుపడం అంటే రాజధానిగా అమరావతికే జై కొట్టినట్టుగా భావించాల్సి ఉంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. బీజేపీ రాజకీయంగా అమరావతికి కట్టుబడి ఉంటుందని చెప్పడం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అప్పుడు ఓ సభలో పవన్ మాట్లాడుతూ.. రాజధాని మార్చినా అది తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు.


ఢిల్లీ నుంచి జగన్‌కు ఫోన్..!
ఇదిలా ఉంటే అమరావతి రైతుల పోరాటం గురించి కేంద్రానికి నిఘా వర్గాలు రిపోర్ట్ అందించడంతో.. అక్కడి పెద్దలు కూడా ఈ విషయంపై దృష్టి సారించారని సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు, ఇతర అంశాలను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ బిల్లుపై వెనక్కి తగ్గాలని ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మూడు, నాలుగు రోజుల కిందట(నవంబర్ 19 లేదా 20) ఓ ఫోన్ కాల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. మూడు రాజధానుల (Three Capitals) గురించి వారు జగన్‌తో చర్చించారని టాక్. దానిపై వెనక్కి తగ్గాలని కూడా సూచించినట్టుగా ప్రచారం జరగుతుంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్.. మూడు రాజధానుల అంశంపై వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం మాత్రం బయటకు పొక్కకుండా 

అంతే కాకుండా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై హైకోర్టులో జరగుతున్న విచారణ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోవడం, బిల్లుల్లో ఉన్న లీగల్ పాయింట్స్ సరిగ్గా లేకపోవడంతో న్యాయమూర్తులు కూడా అమరావతికి మద్దుతుగా వ్యాఖ్యలు చేశారు. అయితే అది తుది తీర్పు కాకపోయినట్టికీ.. వారి మాటలు ఎంతో కొంత తీర్పులో ఉండే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రాకుంటే ఇబ్బందులు తప్పవని భావించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రావడం, న్యాయస్థానాల్లో (courts) ఎదురవుతున్న చిక్కుల కారణంగానే మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గాలని భావించినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది పార్టీలో తనకు సన్నిహితులుగా ఉండే ఇద్దరు, ముగ్గురు నేతలకు మాత్రమే తెలుసని.. దీనిపట్ల చాలా గోప్యత పాటించారని తెలుస్తోంది. ఇక, పార్టీకి సంబంధం లేని ఒక్కరిద్దరు సన్నిహితులతో కూడా జగన్ ఇదే విషయం చర్చించనట్టుగా తెలుస్తోంది.

కేసీఆర్‌తో భేటీ కావడం వెనక..
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు హాజరయ్యారు. అయితే వధువు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు కావడం, వరుడు సీఎం జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు కావడంతో కేసీఆర్, జగన్‌లు హాజరయ్యారని అంతా భావించారు. మరోవైపు ఈ వివాహ వేడుకకు హాజరైన సీఎం కొద్ది సేపు ఏకాంతంగా భేటీ (kcr and jagan talks) అయ్యారు. అయితే వీరిద్దరు ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం, ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి చర్చించుకుని ఉంటారని ప్రచారం జరిగింది. 

3 capitals bill withdrawal what KCR And Jagan Discuss About This

కానీ ఇద్దరు సీఎంలు మధ్య ఏకాంత భేటీలో మూడు రాజధానుల అంశమే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా ఇప్పుడు చాలా మంది భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి జగన్.. కేసీఆర్‌తో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్.. జగన్‌కు కొన్ని సూచనలు చేసినట్టుగా టాక్. మూడు రాజధానులపై ఒకేసారి వెనక్కి తగ్గితే రాజకీయంగా బదనాం అయ్యే చాన్స్ ఉందని.. అందుకే కట్టె విరగకుండా పాము చావకుండా మధ్యే మార్గాన్ని అవలంభించాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్‌.. సమగ్రమైన బిల్లు తీసుకోస్తామని అసెంబ్లీ‌లో ప్రకటన చేశారు. అయితే ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా ఆ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్‌‌లోకి నెట్టారు. 

ఇరువురు సీఎంల భేటీలో మూడు రాజధానుల గురించి చర్చ జరిగిందనడాన్ని కొందరు కొట్టిపడేస్తున్నారు. అయితే కేసీఆర్‌కు ఆప్తుడిగా పేరు ఉన్న నమస్తే తెలంగాణ మాజీ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి చేసిన ట్వీట్ చూస్తే.. తెర వెనక జగన్‌కు కేసీఆర్ సూచనలు చేసి ఉంటాడనే వాదనకు బలం చేకూరుతుంది. గత నెల రోజులుగా ట్విట్టర్‌లో ఎలాంటి పోస్టులు చేయని కట్టా శేఖర్ రెడ్డి.. ఇరువురు సీఎంల భేటీ జరిగిన రోజు ఆసక్తికరమైన పోస్ట్‌లు చేశారు. అమరావతి రాజధాని అంశంపైనే ఆయన ట్వీట్ చేశారు. 

రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడం గురించి ప్రస్తావించిన కట్టా శేఖర్ రెడ్డి.. రాజకీయాల్లో అన్ని సాధ్యమే అని కూడా వ్యాఖ్యానించారు. ‘ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధాని. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ ఆలోచన. అది వీగిపోతుంది. న్యాయపరీక్షలో ఓడిపోయే అవకాశమూ ఉంది. అక్రమమో సక్రమమో అమరావతి అందరూ గుర్తించిన రాజధాని. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా సమర్థించిన రాజధాని. తన ప్రతిపాదన వీగిపోకముందే జగన్ మోహనరెడ్డి తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే కొంతయినా గౌరవం దక్కుతుంది’ అని ఏపీ రాజధాని గురించి ఆయన ట్వీట్ చేశారు.

 

ఆదివారం రాత్రి కట్టా శేఖర్ రెడ్డి (katta shekar reddy) ట్వీట్ చేయగా.. సోమవారం ఉదయం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోబోతుందని ఏపీ ప్రభుత్వ అడ్వొకెట్ జనరల్.. ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని సీఎం జగన్.. శాసన సభలో వెల్లడించారు. సమగ్రమైన బిల్లను త్వరలో తీసుకొస్తామని చెప్పారు. ఈ పరిణామాలు చూస్తే.. కేసీఆర్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాతనే జగన్ మూడు రాజధానులు విషయంలో వెనక్కి తగ్గారనే టాక్ బలంగా వినిపిస్తుంది. కేసీఆర్ సూచనల మేరకే.. అమరావతి ప్రాంతం అంటే తనకు కోపం లేదని.. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ది కావడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ చాలా తేలివిగా ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. మొత్తంగా మడు రాజధానులపై పూర్తిగా వెనక్కి తగ్గలేదని సంకేతాలు ఇస్తూనే.. ప్రస్తుతానికి ఉన్న న్యాయపరమైన చిక్కులను తొలగించుకునేలా, ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలను పాటించామని వారికి తెలిసేలా.. జగన్ వ్యవహరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios