YSRCP : జగన్ రెడ్డిది సాహసమే... ఏకంగా 11మంది సిట్టింగ్ లను పక్కనపెట్టేసాడు, ఆ మంత్రితో సహా
ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న అధికార వైసిపి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోంది. సిట్టింగ్ లను మార్చుతూ కొత్తవారికి, తండ్రుల స్థానంలో వారసులను అవకాశం ఇస్తోంది.
![11 sitting mlas not get chance in YSRCP incharges Second List AKP 11 sitting mlas not get chance in YSRCP incharges Second List AKP](https://static-ai.asianetnews.com/images/01dt8ye9z1vg6b0wmztmr32x34/untitled-1-copy-jpg_363x203xt.jpg)
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అధికార వైసిపి మరోసారి విజయం సాధించమే లక్ష్యంగా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఇలా ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇంచార్జీలను నియమిస్తూ రెండు జాబితాలను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో ఏకంగా ఓ మంత్రిని, పలువురు సిట్టింగ్ లను తప్పించి కొత్తవారిని లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలుగా నియమించి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
రెండో జాబితాలో 27మంది అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటిస్తే అందులో సగానికి పైగా కొత్తముఖాలే. కొన్నిచోట్ల వారసులను అవకాశమిస్తే మరికొన్నిచోట్ల ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ లను పక్కనపెట్టేసారు. పార్టీ చేపట్టిన సర్వేల్లో గెలుపు అవకాశాలు లేవని తేలడంతోనే అధినేత వైఎస్ జగన్ సిట్టింగ్ లకు కాకుండా కొత్తవారిని ఇంచార్జీలుగా నియమించినట్లు వైసిపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రెండో జాబితాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు షాక్ తగిలింది. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జీగా మరసాల భరత్ కుమార్ ను నియమించారు.ఇక ఇటీవల న్యూడ్ వీడియో కాల్ తో మహిళను వేధించినట్లు ఆరోపణలు ఎదర్కొంటూ వివాదంలో చిక్కుకున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను వైసిపి అధిష్టానం మొండిచేయి చూపించింది. హిందూపురం లోక్ సభ ఇంచార్జీగా జోలదరాశి శాంతను నియమించారు. ఇక అనంతపురం లోక్ సభకు మాలగుండ్ల శంకరనారాయణ, అరకు(ఎస్టీ) లోక్ సభకు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని సమన్వయకర్తగా నియమించింది వైసిపి.
Also Read YCP Incharge: వారసులొచ్చారు.. 27 మందితో రెండో జాబితా..
ఇక ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వున్నవారిలో చాలామందిని వైసిపి అధిష్టానం పక్కనబెట్టింది. వీరిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పాయకరావుపేట ఎమ్మేల్యే గొల్ల బాబురావు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే మార్తాండరావు, పత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గున లకు వైసిపి నుండి మరోసారి అవకాశం దక్కలేదు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జీలను వైసిపి అధిష్టానం ప్రకటించింది. ఇలా
ఇక మరో నాలుగు నియోజకవర్గాల్లో వారసులకు అవకాశం ఇచ్చింది వైసిపి. ఎమ్మెల్యేలు పేర్ని నాని కొడుకు కృష్ణమూర్తి అలియాస్ కిట్టు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి, ముస్తాఫా కూతురు షేక్ నూరి ఫాతిమాతో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ లను ఇంచార్జీలుగా నియమించింది వైసిపి. ఇలా మొత్తం సిట్టింగ్ లను మార్చి కొత్తవారికి, తండ్రుల స్థానంలో వారసులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ వైసిపి కీలక ప్రకటన చేసింది.