విశాఖలో 100, కడపలో 99 శాతం వ్యాక్సినేషన్...: విద్యాశాఖ మంత్రి సురేష్ ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయులందరికీ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నామని... ఇప్పటికే 94శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని ఉపాధ్యాయులందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 94శాతం ఉపాధ్యాయులకు వాక్సిన్ వేయటం జరిగిందని తెలిపారు. కేవలం మరో 15,083 మందికి అంటే 6శాతం మంది ఉపాధ్యాయులకు మాత్రమే వాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. త్వరలోనే 100 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.
''రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తే విశాఖపట్నం 100 శాతం పూర్తయింది. కడపలో 99 శాతం, విజయనగర, చిత్తూరు, నెల్లూరులలో 98 శాతం ఉపాధ్యాయులు వాక్సిన్ వేయించుకున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే అతి తక్కువగా 86 శాతం పూర్తయింది. ఇక్కడ ఇంకా 4 వేల మందికి వాక్సిన్ వేయాల్సి ఉంది. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించాం'' అని తెలిపారు.
read more పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోకూడదా..?
''రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో ముందుగా ఉపాధ్యాయులందరికి వ్యాక్సిన్ వేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఈ క్రమంలోనే రాష్ట్రం మొత్తంలో సగటున 94 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తిచేశాం. అతి త్వరలోనే మిగిలిని 4శాతం ఉపాధ్యాయులకు కూడా వ్యాక్సినేషన్ పూర్తిచేస్తాం'' అని విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడించారు.