ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ కీస్ మాయం... తాళం పగలగొట్టి లోపలికెళితే మరో షాక్

Apr 23, 2023, 3:02 PM IST

జగిత్యాల : ఎట్టకేలకు ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సామాగ్రిని దాచిన స్ట్రాంగ్ రూమ్ ను అధికారులు తెరిచారు. హైకోర్టు ఆదేశాలతో నూకపల్లిలోని డాక్టర్‌ వీఆర్‌కే ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజ్‌లో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ ను అధికారులు పగలగొట్టారు. ఈ క్రమంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. హైకోర్ట్ కోరిన 17ఏ,17సి డాక్యుమెంట్లు భద్రపరిచిన ట్రంక్ పెట్టె తాళంచెవి మాయమయ్యాయని అధికారులు తెలిపినట్లు పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసారు. కీస్ లేకపోవడంతో ట్రంక్ పెట్టె తాళాన్ని కూడా అధికారులు పగలగొట్టారు. 17ఏ, 17సి  పత్రాలతో పాటు కౌంటింగ్  హల్ లోని సీసీ టీవీ పుటేజీని సేకరించిన అధికారులు ఈ నెల 26న హైకోర్టుకు అందించనున్నారు.