దుగ్గిరాల ఎంపిపి పీఠం అధికార పార్టీదే... వైసిపి శ్రేణుల సంబరాలు

May 5, 2022, 5:36 PM IST

గుంటూరు: మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల ఎంపిపి ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు దుగ్గిరాల ఎంపిపి పదవిని కూడా అధికార వైసిపి కైవసం చేసుకుంది. వైసీపీ ఎంపీటీసీ రూపా వాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక్కటే బి ఫామ్ దాఖలవడంతో రూపా వాణిని ఎంపిపిగా ఖరారు చేసారు అధికారులు. వైస్ ఎంపీపీ లుగా టిడిపి అభ్యర్థి జబీన్ , జనసేన అభ్యర్ది పసుపులేటి సాయి చైతన్య, కో-ఆప్షన్ సభ్యులుగా టిడిపి బలపరిచిన వహీదుల్లా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి రాం ప్రసన్న కుమార్ అధికారికంగా ప్రకటించారు. దుగ్గిరాల ఎంపిపి పీఠాన్ని దక్కించుకోవడంతో వైసిపి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. భారీగా టపాసులు కాల్చి విజయోత్సవం జరుపుకున్నారు. ఎంపిపిగా ఎన్నికయిన రూపా వాణికి వైసిపి నాయకులు గజమాలతో సత్కరించారు.