May 25, 2022, 10:44 AM IST
అమరావతి: కోనసీమ జిల్లా పేరును మార్చి బిఆర్. అంబేద్కర్ పేరును చేర్చడంపై వివాదం రేగుతోంది. జిల్లా పేరు మార్పును నిరసిస్తూ మంగళవారం కోనసీమ యువత అమలాపురంలో భారీ ఆందోళన చేపట్టారు. చివరకు మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టిన నిరసనకారులు, ఎమ్మెల్యే ఇంటిపైనా దాడిచేసారు. అలాగే ఆందోళనలను అదపుచేయడానికి ప్రయత్నించిన పోలీసులపైనా దాడులు చేసి గాయపరర్చారు. ఈ హింసాత్మక ఘటనలపై తాజాగా సిపిఐ నారాయణ స్పందించారు. కొనసీమ వివాదం చిలికిచికిలి గాలివానగా మారిందని... అయితే ఇది కేవలం అక్కడి కులఘర్షణగా చూడవద్దని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఈ ఘటన ప్రతిబింబిస్తోంది... ఎప్పుడు చాన్స్ దొరికినా ప్రభుత్వ వ్యతిరేక వైఖరని ప్రజలు తెలియజేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని విస్మరించి, ప్రతిపక్షాల బావాలను పంచుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే జరుగుతుందన్నారు. జిల్లాల ఏర్పాటు సమయంలోనే అంబేద్కర్ పేరు పెట్టివుంటే అయిపోయేదన్నారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడంపై వైసిపి స్వార్థ వైఖరి కనిపిస్తోందని... ఇతర పార్టీలపై అబాండాలు వేస్తే లాభం లేదు, పరనింద పనికిరాదని నారాయణ పేర్కొన్నారు.