అమరావతి పాదయాత్రకు వ్యతిరేకంగా జేఏసి నిరసన... నిడదవోలులో తీవ్ర ఉద్రిక్తత

Oct 14, 2022, 4:51 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని కేవలం అమరావతిలోనే కొనసాగించాలని... మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, మహిళలు చాలాకాలంగా ఉద్యమిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి నుండి అరసవెల్లికి చేపట్టిన పాదయాత్ర ఇవాళ(శుక్రవారం) తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఉద్రిక్తంగా మారింది. వైసిపి మూడు రాజధానుల నిర్ణయానికి మద్దుతుగా ఏర్పడిన జేఏసి నేతలు అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇరువర్గాలు నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద ఎదురుపడటంతో పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అమరావతికి రైతులు ఆకుపచ్చ కండువాలు ఎగురేస్తుండగా.. జేఏసీ నేతలు నల్ల కండువాలు ఎగురవేస్తూ నిరసన వ్యక్తం చేసారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా జాగ్రత్తపడ్డ పోలీసులు అదుపుచేసారు.