33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

By Nagaraju TFirst Published Nov 16, 2018, 8:55 AM IST
Highlights

అనూహ్య పరిణామాల నేపథ్యంలో సినీనటుడు దివంగత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ తనయ సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం టిక్కెట్ 
కైవసం చేసుకున్నారు. సుహాసిని అభ్యర్ధిత్వంపై ఉత్కంఠభరిత పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ ఎట్టకేలకు చంద్రబాబు సుహాసినికే టిక్కెట్ కేటాయించారు. 

హైదరాబాద్: అనూహ్య పరిణామాల నేపథ్యంలో సినీనటుడు దివంగత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ తనయ సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం టిక్కెట్ 
కైవసం చేసుకున్నారు. సుహాసిని అభ్యర్ధిత్వంపై ఉత్కంఠభరిత పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ ఎట్టకేలకు చంద్రబాబు సుహాసినికే టిక్కెట్ కేటాయించారు. 

అయితే సుహాసిని నందమూరి కుటుంబం నుంచి  తెలంగాణ గడ్డపై పోటీ చేస్తున్న రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. నాడు దివంగత సీఎం ఎన్టీఆర్ తెలంగాణలో రెండుసార్లు పోటీ చేస్తే 33 ఏళ్ల అనంతరం ఆయన వారసురాలిగా సుహాసిని బరిలోకి దిగుతున్నారు. 

1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో దివంగత సీఎం ఎన్టీఆర్ నల్గొండ జిల్లా నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1983 జనవరి 5న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ మరుసటి సంవత్సరం హార్ట్ బైపాస్ సర్జరీ కోసం ఎన్టీఆర్ ఆమెరికా వెళ్లారు. అదే సమయంలో ఆయన సతీమణి బసవతారకం క్యాన్సర్ బారినపడ్డారు. 

ఎన్టీఆర్ అమెరికాలో ఉండగా రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడింది. తిరిగి స్వరాష్ట్రానికి చేరుకున్న తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్టీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సీఎం కుర్చీపై జరుగుతున్న కుట్రను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అదే సమయంలో క్యాన్సర్ ముదిరి బసవతారకం కన్నుమూశారు. 

ఆ తర్వాత ఎన్టీఆర్ తన రాజకీయ చతురతకు పదును పెట్టారు. ప్రజల్లో తనకున్న అభిమానాన్ని, ప్రజల్లో తనపై ఉన్న విశ్వాసాన్ని నిరూపించుకునేందుకు మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. 1985 మార్చిలో ఎన్నికలకు వెళ్లారు ఎన్టీఆర్. 

ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో హిందూపురం, గుడివాడ నియోజకవర్గాల నుంచి పోటీ చెయ్యగా తెలంగాణలో నల్గొండ నుంచి పోటీ చేశారు. మూడు నియోజకవర్గాల నుంచి ఎన్టీఆర్ అఖండ మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు మళ్లీ అధికారంలోకి వచ్చారు.

ఇక రెండోసారి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ పోటీ చేశారు.  ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1989లో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో హిందూపురం నియోజకవర్గం నుంచి తెలంగాణలో మహబూబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజవకర్గం నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 

కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని ప్రస్తుత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి ఎన్టీఆర్ కు సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరపున చిత్తరంజన్ దాస్ ఎన్టీఆర్ పై పోటీకి నిలిచారు. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా, నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో కల్వకుర్తి నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ తరపున ఆనాటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ కల్వకుర్తిలో ప్రచారం నిర్వహించారు. ఒకవైపు ఎన్టీఆర్, మరోవైపు రాజీవ్ గాంధీ ప్రచారాలతో ఈ ఎన్నిక దేశ్యాప్తంగా పేర్గాంచింది. 

అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి గెలుపొందినప్పటికీ కల్వకుర్తి నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఎన్టీఆర్ పై 3,568 ఓట్ల మెజారిటీతో చిత్తరంజన్ దాస్ గెలుపొంది చరిత్ర సృష్టించారు. 

ఆ పోటీ చిత్తరంజన్ దాస్ రాజకీయ జీవితాన్నే మార్చేసింది. ఎన్టీఆర్ ను ఓడించడంతో చిత్తరంజన్ దాస్ ను జెయింట్ కిల్లర్ గా  అభివర్ణించారు.  ఆతర్వాత ఆయన్ను రాజకీయాల్లో ఒక ఉన్నత శిఖరానికి చేర్చింది. 

అలా రెండు సార్లు తెలంగాణలో దివంగత సీఎం ఎన్టీఆర్ పోటీ చెయ్యగా ఒకసారి గెలుపొందగా మరోసారి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలవ్వడానికి అతని వ్యాఖ్యలే కారణమని ఇప్పటికీ ప్రచారం జరుగుతుంది. తాను చెప్పును నిలబెట్టినా గెలుస్తాదంటూ కీలక వ్యాఖ్యలు చెయ్యడమే పరాజయానికి కారణమని ఇప్పటికీ అంటూ ఉంటారు. 

అలా నందమూరి తారక రామారావు తర్వాత తెలంగాణలో ఆయన వారసులు ఎవరూ పోటీ చెయ్యలేదు. ఆయన తర్వాత అంటే 33 ఏళ్ల అనంతరం తెలంగాణ గడ్డపై ఆయన వారసురాలు పోటీకి దిగుతున్నారు. కూకట్ పల్లి నియోజవకర్గం టీడీపీ అభ్యర్థిగా సుహాసిని పోటీ చేస్తున్నారు.   

ఈ వార్తలు కూడా చదవండి

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

click me!