ఫెయిలైన ఇంటర్ విద్యార్థులకు కేసీఆర్ ఆఫర్

By narsimha lodeFirst Published Apr 24, 2019, 5:37 PM IST
Highlights

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
 

హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. 

రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు

ఈ ఆత్మహత్యలను అత్యంత దురదృష్టకరమైన సంఘటనలుగా సిఎం పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ లో ఫెయిలయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, కాబట్టి విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సిఎం విజ్ఞప్తి చేశారు. 
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు.

విద్యాశాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ల వాల్యువేషన్, ఫలితాల వెల్లడి, అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
‘‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నందున  వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు.

విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్ ను రీ వెరిఫికేషన్ చేయాలి. రీ కౌంటింగ్ చేయాలి. పాసయిన విద్యార్థులకు కూడా రీ వెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్ చేయాలి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించాలని సీఎం అధికారులను కోరారు.

నీట్, జెఇఇ లాంటి దేశ వ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలయింత త్వరగా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

 
‘‘ఇంటర్మీడియట్ తో పాటు ఎమ్సెట్ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతీ సారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర్య సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు.

 మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయన చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యమేదీ కాదు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 


ఇంటర్మీయట్ విద్యార్థుల డాటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. ఇ ప్రొక్యూర్ మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. 

టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదించిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. 

‘‘ఇంటర్మీడియట్ లో ఫెయిలయ్యామనే బాధతో కొంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధ పడ్డాను. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్మీడియట్ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితంలో ఫెయిలయినట్లు కాదు. ప్రాణం చాలా ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలయినప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయన్నారు.

అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, వృత్తులను ఎంచుకుని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుందన్నారు.విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్నట్టు సీఎం చెప్పారు.

సంబంధిత వార్తలు

ఇంటర్ ఫలితాల గొడవ: ఎట్టకేలకు కదిలిన కేసీఆర్

విద్యాశాఖలో వివాదాలు: జగదీష్ రెడ్డి పాలిట శాపం

ఆగని ఆత్మహత్యలు: మరో విద్యార్ధిని బలవన్మరణం, 20కి చేరిన మరణాలు

సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతల యత్నం, అరెస్ట్

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

click me!
Last Updated Apr 24, 2019, 5:53 PM IST
click me!