దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ‘శామ్ సంగ్’ కొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 70 రోజుల్లో ఆ సంస్థ గెలాక్సీ ఏ ఫోన్లు రూ.7000 కోట్ల బిజినెస్ సంపాదించాయి. వచ్చే ఎనిమిది నెలల్లో 4 బిలియన్ డాలర్ల రెవెన్యూ రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది శామ్ సంగ్. ఇక ఇప్పటికే థాయిలాండ్ విపణిలోకి ఆవిష్కరించిన శామ్ సంగ్ గెలాక్సీ ఎ80 ఫోన్ వచ్చేనెల భారత మార్కెట్లోకి రానున్నదని సమాచారం.
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ ఈ ఏడాది భారత మార్కెట్లోకి విడుదల చేసిన శాంసంగ్ ‘ఎ’ సిరీస్ స్మార్ట్ఫోన్లు కేవలం 70 రోజుల్లోనే బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7000 కోట్ల) విలువైన అమ్మకాలు జరిగినట్లు సంస్థ మంగళవారం ప్రకటించింది.
అంతేకాకుండా ఈ ఏడాది చివరినాటికి 4 బిలియన్ డాలర్ల విలువైన శాంసంగ్ గెలాక్సీ ‘ఎ’ సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు శామ్సంగ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం శామ్సంగ్ గెలాక్సీ ఎ సిరీస్లో మొత్తంగా ఆరు మోడళ్లు ఉన్నాయి. వీటికి దేశీయంగా వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ సిరీస్లో 70 రోజుల్లోనే 50 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించామని, ఏడాది చివరికల్లా నాలుగు బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు వేస్తున్నాం అంటూ శామ్సంగ్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు, చీఫ్ మార్కెటింగ్ అధికారి రంజీవ్జిత్ సింగ్ తెలిపారు.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొనేందుకు ప్రతినెలా ఒక స్మార్ట్ఫోన్ని భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు శామ్సంగ్ ప్రకటించింది. శామ్సంగ్ ప్రీమియం కేటగిరిలో తొందర్లోనే భారత మార్కెట్లోకి శామ్సంగ్ ఎ80 మోడల్ను విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రీమియం విభాగంలో శాంసంగ్కు 77 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు రంజీవ్జిత్ సింగ్ పేర్కొన్నారు.
ఎ సిరీస్ లో భాగంగా శామ్ సంగ్ ఎ80 సిరీస్ ఫోన్ వచ్చేనెలలో భారత విపణిలో ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే దీన్ని థాయిలాండ్ మార్కెట్లో ఆవిష్కరించారు. శామ్ సంగ్ ఎ80 గెలాక్సీ ఫోన్ ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉంటుందని అంచనా. శామ్ సంగ్ ఎ80 గెలాక్సీ ఫోన్.. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన వన్ ప్లస్ 7 సిరీస్ ఫోన్లతో ఢీ కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.