శరన్నవరాత్రుల పూజా విధానం

By telugu news teamFirst Published Oct 17, 2020, 12:08 PM IST
Highlights

ఈ నవరాత్రులు నా ఈ శరీరాన్ని మనసును నీ అధీనం చేస్తున్నాను. నాచే ఈ నవరాత్ర ప్రతదీక్ష దిగ్విజయంగా నిర్వహింపచేసుకొని, నన్ను ఆశీర్వదించు తల్లీ అని ప్రార్థించాలి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

శరన్నవరాత్రుల పూజా విధానం, తప్పక తెలుసుకోవాల్సినవి శ్రీదేవీ శరన్నవరాత్రులు ప్రారంభించే ముందురోజునాటికే పూజాసామగ్రి, పూజాద్రవ్యాలు, హోమద్రవ్యాలు సిద్దం చేసుకోవాలి. పూజామందిరంలో 9 అంగుళాలు ఎత్తుగల పీరాన్ని ఏర్పరచుకొని, పీఠముపై ఎర్రని వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై సువర్ణ, రజిత, లేదా తామ్రా కలశమును ఉంచి, కలశమునకు దారములు చుట్టి, కలశములో పరిశుద్ద నదీజలములను నింపి, అందు లవంగములు, యాలకులు, జాజికాయ, పచ్చ కర్పూరము మొదలగు సువర్ణ ద్రవ్యాలు వేసి, నవరత్నాలు, పంచలోహాలను వేసి, పసుపు, కుంకుమ, రక్తచందన, చందనాదులను వేసి, మామిడి, మారేడు, మోదుగ, మర్రి, జమ్మి చిగుళ్ళను ఉంచి, పరిమళ పుష్పాదులను వేసి, దానిపై పీచు తీయని, ముచ్చిక కలిగిన టెంకాయనుంచి, దానిపై ఎర్రని చీర, రవిక వేసి, కలశమును చందన, కుంకుమ, పుష్పాదులతో అలంకరించాలి. 

యధా శాస్త్రీయముగా విఘ్నేశ్వరపూజ చేసి , రక్షా బంధన పూజ చేసి , రక్షా బంధనాన్ని ధరించి, కలశ స్థాపన పైన చెప్పిన విధంగా చేసి, ప్రాణ ప్రతిష్ట కరన్యాసములు చేసి, షోడశ ఉపచారములతో శ్రీ సూక్త విధానంగా సహస్ర నామములతో, త్రిశతీ నామములతో, అష్ణోత్తర శతనామములతో, దేవీ ఖడ్గమాలా నామములతో, పసుపు, కుంకుమ, హరిద్రాక్షతలు, కుంకుమాక్షతలు, రక్తచందనాక్షతలు, శ్రీచందనాక్షతలు, బిల్వదళములు, తులసీదళములు, పరిమళ పుష్పాదులతో అర్చన చేసి , నవకాయ పిండి వంటలతో రకరకాలైన ఫలములను, చలివిడి, వడపప్పు, పానకము, తేనె, పంచదార, పెరుగు, నివేదన చేసి , మంగళహారతిచ్చి అమ్మవారిని ఈవిధంగా ప్రార్జించాలి. 

తల్లీ! ఈ నవరాత్రులు నా ఈ శరీరాన్ని మనసును నీ అధీనం చేస్తున్నాను. నాచే ఈ నవరాత్ర ప్రతదీక్ష దిగ్విజయంగా నిర్వహింపచేసుకొని, నన్ను ఆశీర్వదించు తల్లీ అని ప్రార్థించాలి. ఈ విధంగా నవరాత్ర వ్రతము ఆరంభించిన దగ్గర నుండి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, స్నాన సంధ్యాదులు ముగించుకొని, త్రికాలార్చనగానీ, షట్కాలార్చనలతోగానీ అమ్మవారిని తృప్తి పరుసూ, ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసముండి, సాయంకాల అర్చన ముగించుకొని అమ్మవారికి మహా నివేదన గావించి నక్షత్రములను దర్శించి భోజనము చేయాలి. ఉల్లి, వెల్లుల్లి విసర్జించాలి. సాంసారిక సుఖానికి దూరంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. భూమిపైనే శయనించాలి. 

ప్రతి నిత్యము అమ్మవారిని నవదుర్గా రూపములో అలంకరించుకొని ఆరాధించాలి. అమ్మవారి యొక్క విగ్రహాన్ని స్థాపన చేసుకోదలచిన వారు అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి అష్టభుజాలతో, అష్టవిధ ఆయుధాలను ధరించి, సౌమ్య మూర్తియై అభయ ప్రదానం సౌమ్య స్వరూపిణిగా గానీ చతుర్భుజాలతో పద్మాసనం వేసుకొని సింహాసనం మీద కూర్చొని చతుర్భుజాలలో అభయ, వరద, పాశ, అంకుశములను ధరించి, సౌమ్య మూర్తిగా కిరీటములో చంద్రవంకను ధరించినటువంటి విగ్రహాన్నిగానీ స్థాపించుకొని ఆరాధించాలి. 

ప్రతినిత్యము అమ్మకు ప్రియమైన చండీ సప్తశతీ, దేవీ భాగవత, సౌందర్యలహరి పారాయణలను చేసుకుంటూ వుండాలి. సువాసినీపూజ, కుమారీపూజ, శ్రీ చక్ర నవావరణార్చనాది అర్చనలతో అమ్మవారిని తృప్తి పరుస్తూ ఉండాలి. గీత, వాద్య, నృత్యాదులతో అమ్మవారికి ఆనందాన్ని కలుగచేయాలి. నామ సంకీర్తనలతో ఆ తల్లిని ఆనందింప చేయాలి. దీపాలు వెలిగించి ఆ తల్లికి సంతోషాన్ని కలుగచేయాలి. అమ్మవారికి ప్రియమైన శ్రీ విద్య, చండీ, దశమహావిద్యాది హోమాదులతో అమ్మను తృప్తిపరచాలి. 

అమ్మకు ప్రియమైన బాలాషడక్షరీ, లలితాపంచదశాక్షరీ, రాజరాజేశ్వరీ మహాషోడశాక్షరీ, మహామంత్రాదులను యధాశక్తి జపించాలి. ఎర్రని వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఎర్ర చందనము, చందనము, పసుపు, కుంకుమ ధరించాలి. అమ్మకు ప్రియమైన ముత్యాల, పగడాల, రుద్రాక్ష మాలికలను ధరించాలి. అమ్మభావన కలిగి, అమ్మను ఆరాధిస్తుండాలి. పరుషమైన మాటలు, అమంగళకరమైన వాక్యాలు పలుకకూడదు. గోవులను శక్యానుసారముగా గ్రాసం పెట్టి నవరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

click me!