విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం

Published : Aug 28, 2026, 05:47 PM IST

Telangana: తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్య, ఆధునిక నైపుణ్యాలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా జపాన్‌కు చెందిన హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య ఒప్పందం జ‌రిగింది.

PREV
14
హెచ్‌ఐటీ, వైఐఎస్‌యూ మధ్య కీలక ఒప్పందానికి ముందడుగు

జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ప్రతినిధి బృందం శుక్రవారం హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించింది. శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో జరిగిన ఈ పర్యటనలో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల తయారీపై విస్తృత చర్చలు జరిగాయి.

తెలంగాణలోని పరిశ్రమల అవసరాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. తొలి దశలో ఇరుపక్షాలు పరస్పర అవగాహనతో సహకార రంగాలను గుర్తించి, తదుపరి కార్యాచరణను రూపొందించనున్నాయి.

24
విద్యార్థులకు జపాన్‌లో ప్రత్యక్ష శిక్షణ అవకాశాలు

ఈ భాగస్వామ్యంలో విద్యార్థుల పరస్పర మార్పిడి కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీని ద్వారా తెలంగాణ విద్యార్థులు జపాన్‌లోని ఆధునిక సాంకేతిక విద్యా విధానాలు, ప్రయోగశాల ఆధారిత బోధన, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం పొందనున్నారు. కేవలం పుస్తకాలు, తరగతి గది బోధనకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాస్తవ పరిస్థితుల్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకునేలా విద్యార్థులకు పరిశ్రమల అనుభవం కల్పించే అంశంపైనా చర్చ జరిగింది.

34
ఏఐ, ఆటోమొబైల్ నుంచి అధునాతన తయారీ వరకు

భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో కీలకంగా మారుతున్న పలు రంగాలను భాగస్వామ్య కార్యక్రమాల్లో చేర్చాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. అధునాతన తయారీ, మొబిలిటీ, ఆటోమొబైల్ టెక్నాలజీ, కృత్రిమ మేథస్సు (AI), ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీలు, పర్యావరణ సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పనిచేయనున్నారు.

తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి ప్రత్యేక కోర్సులు రూపొందించే అవకాశాలను పరిశీలించనున్నారు. జపాన్‌లోని సాంకేతిక విద్య, తయారీ రంగంలోని ఉత్తమ విధానాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడంపై కూడా దృష్టి పెట్టనున్నారు.

44
అధ్యాపకులు, శిక్షకులకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి

విద్యార్థులతో పాటు అధ్యాపకులు, శిక్షకుల సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలపైనా సహకారం ఉండనుంది. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (ToT), స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు, పరిశోధన, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుభవం వంటి అంశాలను భాగస్వామ్యంలో భాగం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోని స్థానిక పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నైపుణ్యాలను ఎంపిక చేయనున్నారు. తరగతి గది, ప్రయోగశాల బోధనను పరిశ్రమల్లో ఎదురయ్యే వాస్తవ సవాళ్లతో అనుసంధానం చేసే హెచ్‌ఐటీ విధానాన్ని తెలంగాణలో ఎలా అమలు చేయవచ్చనే అంశంపైనా చర్చించారు.

హైదరాబాద్‌కు రావాలని హెచ్‌ఐటీ ప్రతినిధులకు ఆహ్వానం

భాగస్వామ్యంపై తదుపరి చర్చలు కొనసాగించేందుకు హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతినిధులు హైదరాబాద్‌కు రావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని సందర్శించి, భవిష్యత్ కార్యక్రమాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అలాగే డిసెంబరులో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’కు కూడా హెచ్‌ఐటీ ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. జపాన్‌లోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, పరిశ్రమలతో తెలంగాణకు మరిన్ని సంస్థాగత సంబంధాలు ఏర్పడేలా ఈ భాగస్వామ్యాలను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ, పరిశ్రమల అనుభవాన్ని తెలంగాణ యువతకు అందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories