
ఇటీవలి కాలంలో భారత్ పొరుగు దేశాల్లో రాజకీయ అస్థిరత పెరిగింది. రాజకీయ ఉత్కంఠ, ఆర్థిక సంక్షోభాలకు వేదికైంది. భారత్ పొరుగున మూడు దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి — శ్రీలంక (2022లో ఆర్థిక సంక్షోభం తర్వాత అధ్యక్షుడు రాజీనామా), బంగ్లాదేశ్ (2024లో హింసాత్మక తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా పదవీచ్యుతి), ఇప్పుడు నేపాల్ (2025లో కేపీ శర్మ ఓలీ రాజీనామా). ఈ మూడు సంఘటనలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి భారత్ చుట్టూ రాజకీయ అస్తిరత పెరుగుతోంది. నేపాల్లో ఇటీవల జరిగిన నిరసనలు, ప్రభుత్వ కూలిపోవడం కేవలం ఒక అంతర్గత సమస్య కాదు. ఇది దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలపై, భారత్ భద్రతపై, వాణిజ్య మార్గాలపై నేరుగా ప్రభావం చూపుతుంది.
2025 సెప్టెంబర్లో నేపాల్లో పరిస్థితి ఒక్కసారిగా ముదిరింది. సోషల్ మీడియాపై నిషేధం విధించడం, దేశంలోని అవినీతి పెరగడం యువతను ఆగ్రహానికి గురి చేసింది. జెన్-జెడ్ తరం వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది. 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఆయన కేవలం 14 నెలల క్రితమే అధికారంలోకి వచ్చారు. పార్లమెంట్పై దాడులు, రాజకీయ నేతల ఇళ్లకు నిప్పంటించడం వంటి ఘటనలు కాఠ్మాండూను కలవరపరిచాయి. ప్రజాగ్రహంతో ఏకంగా ఆ దేశ ప్రధాని మారిపోయాడు. శనివారం నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కి బాధ్యతలు స్వీకరించారు.
ఇదిలా ఉంటే తమ దేశానికి మోదీ లాంటి బలమైన నాయకత్వం కావాలని నేపాల్ యువత కోరుతోంది. దేశాన్ని ఏకతాటిపై నడిపించే డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ అవసరం అని అభిప్రాయపడుతున్నారు. అవినీతి లేని కొత్త నాయకులు ముందుకు రావాలని అంటున్నారు. ఇది కేవలం ప్రభుత్వ మార్పు కాదు, తరతరాలుగా మూలపదంగా ఉన్న రాజకీయ వ్యవస్థపై తిరుగుబాటు అంటూ అక్కడి యువత పిలుపునిస్తున్నారు.
2022లో శ్రీలంకలో భారీ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. చైనా నుంచి తీసుకున్న రుణాలు, హంబంటోటా పోర్ట్ను 99 ఏళ్ల లీజుకు ఇవ్వడం, ప్రభుత్వ అవినీతి ఇవన్నీ కలిపి దేశం దివాలా తీసేలా చేశాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేపట్టారు. చివరికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. ఇంధనం, ఆహారం, ఔషధాలు అత్యవసరంగా అందించింది. చైనా మాత్రం మాటలకే పరిమితమైంది.
2024లో బంగ్లాదేశ్ రాజకీయాలు తలకిందులయ్యాయి. షేక్ హసీనా పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నా, అవినీతి, నియంత్రణ రహిత విధానాలపై ప్రజల ఆగ్రహం ఉప్పొంగింది. ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలను ముట్టడించారు. చివరికి సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. భారత్ హసీనా ప్రభుత్వానికి మిత్రదేశం. ఆమె పదవి కోల్పోవడంతో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీంతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు క్షీణించాయి.
నేపాల్లో నెలకొన్న పరిస్థితులు భారత్పై నేరుగా ప్రభావాన్ని చూపుతాయి. దీనికి కారణాలు..
* 1,750 కిలోమీటర్ల పొడవైన ఓపెన్ బోర్డర్
* కుటుంబ, మత, సాంస్కృతిక బంధాలు
* నేపాల్ ఆర్థికంగా భారత్ ఎగుమతులపై ఆధారపడటం (చమురు, ఆహారం)
నేపాల్ అస్థిరత అంటే భారత్కు నేరుగా భద్రతా సవాల్గా మారుతుంది. చైనా ప్రభావం పెరగడం కూడా మరో ఆందోళన. చైనా వెస్టర్న్ థియేటర్ కమాండ్ నేపాల్ వెంబడి ఉండడం భారత్ వ్యూహాత్మకంగా అప్రమత్తంగా ఉండేలా చేస్తోంది.
భారత్ ఇప్పుడు ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పాకిస్థాన్తో ఎలాగో సంబంధాలు బాగా లేవు. కాగా బంగ్లాదేశ్లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంతో కూడా ఢిల్లీకి అంతలా సాన్నిహిత్యం లేదు. అదే విధంగా శ్రీలంకలో చైనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటితో పాటు తాజాగా నేపాల్లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం భారత్తో ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి.
చుట్టూ ఉన్న దేశాలతో దౌత్య చర్చలు జరపాలి. సరిహద్దు భద్రత కఠినంగా పర్యవేక్షించాలి. వీటితో పాటు చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసే వ్యూహాత్మక ప్రాజెక్టులు చేపట్టాలి. భారత్ ఎంత బలమైన ఆర్థిక, సైనిక శక్తిగా ఎదిగినా, పొరుగుదేశాలు అస్థిరంగా ఉంటే దాని ప్రభావం తప్పదు. భారత్ శాంతియుత, స్థిరమైన పరిసరాలు కోరుకుంటే, పొరుగుదేశాల సంక్షోభాలను నిర్లక్ష్యం చేయకూడదు. సహాయం, దౌత్యం, ఆర్థిక భాగస్వామ్యం ద్వారా మాత్రమే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.