Idli: ప్రస్తుతం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అయితే బెంగళూరుకు సమీపంలో ఉన్న ఓ ప్రదేశంలో మాత్రం ఇప్పటికీ 5 రూపాయలకే ఇడ్లీ విక్రయిస్తున్నారు. దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతోన్న ఈ ఇడ్లీ గురించి తెలుసుకోవాల్సిందే.
దక్షిణ భారతదేశంలో ఇడ్లీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆరోగ్యకరమైన టిఫిన్గా పేరొందిన ఈ వంటకాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే కర్ణాటకలోని కనకపురలో ఉన్న ఓ చిన్న ఇడ్లీ దుకాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.5కే ఇడ్లీ విక్రయిస్తూ, దాదాపు ఆరు దశాబ్దాలుగా ఒకే రుచిని అందిస్తున్న 70 ఏళ్ల రామచంద్ర అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
25
60 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న రామచంద్ర
బెంగళూరుకు సమీపంలోని కనకపురలో "కోటె మనే ఇడ్లీ" పేరుతో ఈ చిన్న దుకాణం ఉంది. దీనిని 1970 ప్రాంతంలో రామచంద్ర తండ్రి శేషప్ప ప్రారంభించారు. అప్పట్లో రూ.1కే 10 ఇడ్లీలు విక్రయించేవారు. పదో తరగతి పూర్తయ్యాక కేవలం 16 ఏళ్ల వయసులోనే రామచంద్ర ఈ వ్యాపార బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి తన తండ్రి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అదే రుచిని ఇప్పటికీ కాపాడుతున్నారు.
35
ఉదయం 4 గంటలకే పని ప్రారంభం.. రోజూ 1,500 ఇడ్లీలు
70 ఏళ్ల వయసు వచ్చినా రామచంద్ర ఇప్పటికీ ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి పనిని ప్రారంభిస్తారు. ఇడ్లీ పిండిని స్వయంగా కలిపి, కట్టెల పొయ్యిపై ఆవిరితో ఇడ్లీలు తయారు చేస్తారు. దాదాపు ఆరు గంటల పాటు వంటగదిలో శ్రమించి రోజుకు సుమారు 1,500 ఇడ్లీలు సిద్ధం చేస్తారు. వయసు పెరిగినా పనిపై ఉన్న ప్రేమ, తండ్రి జ్ఞాపకాలను నిలబెట్టాలనే తపనే తనకు శక్తినిస్తుందని ఆయన చెబుతున్నారు.
ఈ దుకాణంలో ఒక్క ఇడ్లీ ధర ఇప్పటికీ కేవలం రూ.5 మాత్రమే. తక్కువ ధరతో పాటు అద్భుతమైన రుచే ఈ దుకాణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఇక్కడి ఇడ్లీ పిండిని ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. ఉడికించిన బియ్యం, మినప్పప్పును సరైన నిష్పత్తిలో కలిపి సంప్రదాయ విధానంలో పులియబెట్టి కట్టెల పొయ్యిపై ఆవిరితో వండుతారు. ఇడ్లీతో పాటు అందించే కారం చట్నీ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. గుంటూరు, బ్యాడగి మిరపకాయలు, తాజా పుదీనా, శనగపప్పుతో తయారుచేసే ఈ చట్నీ రుచిని మరింత పెంచుతుంది.
55
కుటుంబ సహకారంతో కొనసాగుతున్న సేవ
రామచంద్రకు ఆయన కుమారుడు అనంత్, కోడలు నిరోషా సహాయం చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ చిన్న దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. లాభాల కంటే ప్రజలకు మంచి ఆహారం అందించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని వారు చెబుతున్నారు. తాను పని చేయడం ఆపేస్తే జీవితమే ఆగిపోయినట్టేనని భావిస్తానని రామచంద్ర అంటున్నారు. వంటగదిలో గంటల తరబడి పనిచేసినా, తన దుకాణానికి వచ్చే కస్టమర్ల ఆనందాన్ని చూసినప్పుడు అలసట మాయమైపోతుందని ఆయన చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న చిన్న ఇడ్లీ దుకాణం
కోటె మనే ఇడ్లీ దుకాణం ఇప్పుడు కేవలం కనకపురకే పరిమితం కాలేదు. నాణ్యమైన రుచి, తక్కువ ధర, సంప్రదాయ వంట విధానం కారణంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. పెద్ద పెద్ద హోటళ్లకు ఏమాత్రం తీసిపోని రుచితో, దశాబ్దాలుగా ఒకే నాణ్యతను కొనసాగిస్తున్న ఈ చిన్న దుకాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. రామచంద్ర కష్టపడి కాపాడుతున్న ఈ వారసత్వం ఇప్పుడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది.