ప్ర‌కృతి క‌న్నెర్ర చేస్తే ఇంత భ‌యంక‌రంగా ఉంటుందా.? ఈ వీడియోలు చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే

Published : Jul 07, 2026, 05:14 PM IST

Wayanad: కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వయనాడ్ జిల్లాలో జరుగుతున్న సొరంగం నిర్మాణ పనుల వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. 

PREV
15
సొరంగం నిర్మాణ ప్రాంతంలో ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియ

వయనాడ్‌లోని అనక్కంపొయిల్–కల్లాడి సొరంగం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మీనాక్షి వంతెన సమీపంలోని కొండ భారీగా కూలిపోవడంతో నిర్మాణ ప్రాంతమంతా మట్టి దిబ్బలతో నిండిపోయింది. నిర్మాణ పనుల కోసం తవ్విన ప్రాంతం కుంగిపోవడంతో అక్కడ ఉన్న కార్మికులు అప్రమత్తం అయ్యేలోపే శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాదంలో ఒక ఇల్లు, సమీపంలోని చర్చి తీవ్రంగా దెబ్బతినగా, బస్‌స్టాప్‌, వంతెనలో కొంత భాగం కూడా మట్టిలో కూరుకుపోయాయి.

25
శిథిలాల కింద పలువురు కార్మికులు.. సహాయక చర్యలు ముమ్మరం

ఈ ఘటనలో 30 నుంచి 50 మంది వరకు కార్మికులు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని స్థానికులు, సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసి సమీప ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణ సంస్థకు చెందిన తాత్కాలిక కార్యాలయ కంటైనర్లు, కార్మికులను తీసుకువెళ్తున్న బస్సులు, కార్లు, జేసీబీ యంత్రాలు కూడా మట్టి కింద పూడుకుపోయాయి. సమీపంలో ఉన్న ఓ కుటుంబం కూడా శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు కొనసాగుతోంది.

35
భారీ వర్షాలతో రెస్క్యూకు ఆటంకం.. అప్రమత్తమైన అధికారులు

ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్‌, రాపిడ్ రెస్పాన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే నిరంతర వర్షం, కూలిపోయిన భారీ వృక్షాలు, ఉప్పొంగుతున్న చిన్న నది కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రమాదం మరింత పెరగకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వయనాడ్, కోజికోడ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు అమల్లో ఉన్నాయి. కల్లాడి ప్రాంతంలో గత 24 గంటల్లో 265 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

45
అత్యవసర సమావేశం.. ఘటనాస్థలానికి మంత్రులు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందించింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా రక్షించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు ఘటనాస్థలానికి బయలుదేరి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన అన్ని సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం సూచించింది.

55
2024 విషాదం మళ్లీ గుర్తు చేసిన తాజా ప్రమాదం

వయనాడ్‌లో గత ఏడాది కూడా భారీ కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముండక్కై, చూర్‌మాలా ప్రాంతాల్లో సంభవించిన ఆ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి కోలుకోకముందే మరోసారి భారీ వర్షాల కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories