WhatsApp Spying In Divorce Cases: విడాకుల కేసులో వాట్సాప్ స్పై చాట్ సాక్ష్యం చెల్లుతుందా?

Published : Aug 14, 2025, 02:50 PM IST

WhatsApp Spying In Divorce Cases: విడాకుల కేసుల్లో భార్య అనుమతి లేకుండా సేకరించిన వాట్సాప్ స్పై చాట్‌లను సాక్ష్యంగా అనుమతించవచ్చని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గోప్యత హక్కుకు కొన్ని పరిమితులు ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది.

PREV
15
విడాకుల కేసులో భార్య వాట్సాప్ చాట్ సాక్ష్యాలు

WhatsApp Spying In Divorce Cases: విడాకుల కేసు విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు జూన్ 16, 2025న ఒక సంచలన తీర్పునిచ్చింది. విడాకుల కేసులో భార్య అక్రమ సంబంధాన్ని నిరూపించడానికి, ఆమె అనుమతి లేకుండా సేకరించిన ప్రైవేట్ వాట్సాప్ చాట్‌లను కూడా సాక్ష్యంగా చూపవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఈ సాక్ష్యం ప్రామాణికతను కుటుంబ న్యాయస్థానం నిర్ధారించాలని కూడా సూచించింది.

ఈ కేసులో భర్త తన భార్య ఫోన్‌లో ఆమెకు తెలియకుండా ఒక ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, ఆమె వాట్సాప్ చాట్‌లను సేకరించాడు. ఆ చాట్‌లలో ఆమె మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది. ఈ ఆధారాలతో అతను భార్యపై 'క్రూరత్వం, అక్రమ సంబంధం' ఆరోపణలతో విడాకులు కోరాడు.

DID YOU KNOW ?
భరణం
విడాకుల తర్వాత భార్యకు Hindu Adoptions and Maintenance Act, 1956 ప్రకారం ఆర్థిక భరణం (Maintenance/Alimony) పొందే హక్కు ఉంటుంది, అది ఆమె జీవన, అవసరాలను కవర్ చేస్తుంది. దీని కోసం చాలా అంశాలు ముడిపడి ఉంటాయి.
25
మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

భార్య తరఫు న్యాయవాదులు దీనిని వ్యతిరేకించారు. తన భర్త తన గోప్యత హక్కును ఉల్లంఘించారనీ, అందువల్ల ఈ సాక్ష్యం చెల్లదని వాదించారు. అయితే, హైకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. గోప్యత హక్కు అనేది సంపూర్ణమైనది కాదనీ, కొన్ని సందర్భాలలో న్యాయబద్ధమైన విచారణకు సంబంధించిన హక్కుకు లోబడి ఉంటుందని పేర్కొంది.

కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984లోని (Family Courts Act 1984) సెక్షన్ 14 ప్రకారం.. కుటుంబ న్యాయస్థానాలు వివాదాలను పరిష్కరించడానికి అవసరమైన సాక్ష్యాలను స్వీకరించే అధికారం కలిగి ఉంటాయని హైకోర్టు తెలిపింది. ఈ సాక్ష్యాలు భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872 ( Indian Evidence Act 1872) ప్రకారం ఆమోదయోగ్యమైనవి కాకపోయినా, ఈ చట్టం కింద అనుమతించవచ్చని పేర్కొంది. ఈ తీర్పు ద్వారా మధ్యప్రదేశ్ హైకోర్టు భర్తకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అయితే, వాట్సాప్ చాట్‌ల ప్రామాణికతను, వాటిపై ఆధారపడి తీర్పు ఇవ్వాలా వద్దా అనేది కుటుంబ న్యాయస్థానం విచారణ అనంతరం నిర్ణయించాలని స్పష్టం చేసింది.

35
ఈ వివాదం ఎలా మొదలైంది?

మధ్యప్రదేశ్ హైకోర్టు జూన్ 17, 2025న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ కేసులో జరిగిన సంఘటనల కాలక్రమం ఇలా ఉంది:

  • డిసెంబర్ 1, 2016: ఈ దంపతులు గ్వాలియర్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు.
  • అక్టోబర్ 11, 2017: వారికి ఒక అమ్మాయి జన్మించింది.
  • 2018: భర్త హిందూ వివాహ చట్టం 1955 (Hindu Marriage Act 1955) లోని సెక్షన్ 13 ప్రకారం భార్యపై క్రూరత్వం ఆరోపణలతో విడాకుల కోసం దావా వేశాడు. భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని నిరూపించడానికి, ఆమె వాట్సాప్ చాట్‌లను ఆధారంగా సమర్పించాడు.
  • భార్య ఫోన్‌లో ఒక ప్రత్యేక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఆమె చాట్‌లు తన ఫోన్‌కు ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ అయ్యాయని భర్త కోర్టుకు తెలిపాడు. ఆ చాట్‌లలో ఆమె ఒక మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆధారాలు లభించాయని వివరించాడు.
  • ఏప్రిల్ 13, 2024: గ్వాలియర్ కుటుంబ న్యాయస్థానం భర్త సమర్పించిన వాట్సాప్ చాట్‌లను సాక్ష్యంగా అనుమతించింది.
  • ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భార్య హైకోర్టులో అప్పీల్ చేసింది.
45
భార్య చేసిన వాదనలు ఏమిటి?

మధ్యప్రదేశ్ హైకోర్టులో భార్య తరఫు న్యాయవాదులు ఈ క్రింది వాదనలను వినిపించారు:

భర్త తన భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్‌లో అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయడం చట్టవిరుద్ధం. ఇది ఆమె గోప్యత హక్కును ఉల్లంఘించింది. అక్రమ మార్గంలో సేకరించిన ఈ సాక్ష్యాలను కోర్టు పరిగణనలోకి తీసుకోకూడదు.

భర్త సేకరించిన సాక్ష్యాలు సమాచార సాంకేతిక చట్టం (Information Technology Act) లోని సెక్షన్ 43, 66, 72 లను ఉల్లంఘించాయి.

మధ్యప్రదేశ్ హైకోర్టు ఏమని తీర్పు చెప్పింది?

మధ్యప్రదేశ్ హైకోర్టు పలు సుప్రీంకోర్టు తీర్పులను విశ్లేషించి, భారతీయ సాక్ష్యాధారాల చట్టం, కుటుంబ న్యాయస్థానాల చట్టాలను పరిశీలించి ఇలా పేర్కొంది:

  • శారదా vs ధర్మపాల్ (2003), కెఎస్ పుట్టస్వామి vs యూనియన్ ఆఫ్ ఇండియా (2017) కేసులను కోర్టు ప్రస్తావించింది. ఈ కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం, గోప్యత హక్కు ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించినప్పటికీ, అది సంపూర్ణమైనది కాదు. దానికి కొన్ని మినహాయింపులు, పరిమితులు ఉన్నాయి.
  • అవసరమైన సందర్భాలలో, వ్యక్తిగత జీవితంపై జోక్యం చేసుకోవడానికి చట్టాలు అనుమతిస్తాయి. కుటుంబ న్యాయస్థానాల చట్టంలోని సెక్షన్ 14, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 122 వంటి నిబంధనలు గోప్యత హక్కుపై జోక్యం చేసుకోవడానికి అనుమతిస్తాయి.
  • ఈ కేసులో ఉన్నట్లుగా, గోప్యత హక్కు (ఆర్టికల్ 21), న్యాయబద్ధమైన విచారణ హక్కు (ఆర్టికల్ 21) మధ్య వివాదం తలెత్తితే, గోప్యత హక్కు న్యాయబద్ధమైన విచారణ హక్కుకు లోబడి ఉండాల్సి ఉంటుంది.
  • ఒక వివాదంలో ఉన్న వ్యక్తికి తన గోప్యత హక్కు ఉన్నప్పటికీ, కేసును నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించే హక్కు కూడా వ్యతిరేక పక్షానికి ఉంటుంది. న్యాయబద్ధమైన విచారణకు ఇది తప్పనిసరి.
  • ఒకవేళ సాక్ష్యాలను ప్రారంభ దశలోనే నిరాకరిస్తే, ప్రజా న్యాయం దెబ్బతింటుంది. కుటుంబ న్యాయస్థానాల చట్టంలోని సెక్షన్ 14లో ఉన్న ప్రత్యేక నిబంధనలను ఇది నిర్వీర్యం చేస్తుంది. ఈ చట్టం ప్రకారం, సాక్ష్యాధారాల చట్టం ప్రకారం అనుమతించని సాక్ష్యాలను కూడా కోర్టు స్వీకరించవచ్చు.
  • సాక్ష్యం ఎలా సేకరించారు అనేదానితో సంబంధం లేకుండా, అది కేసులో సందర్భోచితంగా ఉంటే (relevant) దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
55
మధ్యప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు ఏమిటి?

మధ్యప్రదేశ్ హైకోర్టు జూన్ 16, 2025న ఇచ్చిన తీర్పులో ఈ క్రింది వివరాలను పేర్కొంది:

కుటుంబ న్యాయస్థానాల చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం, న్యాయస్థానాలు సాక్ష్యాలను సేకరించే విధానంలో చాలా స్వేచ్ఛను కలిగి ఉంటాయి. వివాద పరిష్కారానికి అవసరమని భావిస్తే, చట్టబద్ధంగా సేకరించినా, లేక అక్రమంగా సేకరించినా ఆ సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.

  • అయితే, కేవలం ఒక సాక్ష్యాన్ని రికార్డులో చేర్చడం అంటే అది రుజువైనట్లు కాదు. దాని విశ్వసనీయతను, ప్రామాణికతను కుటుంబ న్యాయస్థానం నిర్ణయించాలి.
  • ఈ సాక్ష్యాన్ని వ్యతిరేక పక్షం ప్రశ్నించవచ్చు, క్రాస్-ఎగ్జామినేషన్ చేయవచ్చు. దానిని నిరాధారం అని నిరూపించవచ్చు.
  • న్యాయస్థానం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి, సేకరించిన సాక్ష్యానికి ఎంత విలువ ఇవ్వాలి, దానిపై ఆధారపడాలా లేదా అనే విషయాలను నిర్ణయించుకుంటుంది.
  • గోప్యత హక్కును ఉల్లంఘించే సాక్ష్యాలను అనుమతించకపోతే, కుటుంబ న్యాయస్థానాల స్థాపన ముఖ్య ఉద్దేశ్యం దెబ్బతింటుంది. అందుకే సాక్ష్యం సందర్భోచితత (relevance) మాత్రమే ప్రధాన ప్రమాణంగా ఉంటుంది.
  • అక్రమంగా సాక్ష్యాన్ని సేకరించిన వ్యక్తికి, అది చట్టవిరుద్ధమని రుజువైతే, సివిల్ లేదా క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షార్హుడు అవుతాడు.
  • ఈ సాక్ష్యాలను చాలా జాగ్రత్తగా, పరిశీలనాత్మకంగా విచారించాలి. అవి ట్యాంపరింగ్ కు గురికాలేదని నిర్ధారించుకోవాలి.

ఈ తీర్పు ద్వారా మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించింది. భార్య వాట్సాప్ స్పై చాట్‌లను సాక్ష్యంగా అనుమతించాలని నిర్ణయించింది.

Read more Photos on
click me!

Recommended Stories