ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఎంత ముఖ్యమో.. ఎలా తింటున్నాం? ఎప్పుడు తింటున్నామనేది కూడా అంతే ముఖ్యం. ఆహారం గురించి ఆయుర్వేదం చాలా విషయాలు చెబుతోంది. కొన్ని రకాల ఆహారాలు మాంసంతో అస్సలు తినకూడదు అంటున్నారు నిపుణలు. ఏ పదార్థాలు, ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
మాంసంతో పాటు పాలు తాగితే ఏమవుతుంది?
మాంసం, పాలు రెండిట్లో ప్రొటీన్ ఉంటుంది. జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది. అందుకే రెండూ కలిపి తీసుకోకూడదు అంటారు నిపుణులు. మాంసం తిన్నాక పాలు అస్సలు తాగకూడదు. ఒకవేళ తాగితే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పాల పదార్థాలు:
నిపుణుల ప్రకారం మాంసంతో పాటు పాల పదార్థాలు కూడా తినకూడదు. చాక్లెట్ కలిపిన పాలు కూడా తాగకూడదు. చాలామంది బ్రేక్ఫాస్ట్ లేకపోతే పాలు, అరటిపండు తింటారు. కానీ అలా తినడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణలు. అలా తింటే అజీర్తి, గుండెలో మంట వస్తాయట.
చిక్కుడు తింటే ఏమవుతుంది?
చిక్కుడు పోషకమైన కూరగాయ అయినప్పటికీ... చికెన్, మటన్, గుడ్లు, చేపలు తిన్నప్పుడు వాటిని తినకూడదట. అంతేకాదు చిక్కుడు, బంగాళాదుంపను పాలతో పాటు కూడా తినకూడదట.
నువ్వుల నూనె:
చేపల పులుసు లాంటివి నువ్వుల నూనెలో చేస్తే మంచి వాసన వస్తుంది. కానీ చేపల్ని నువ్వుల నూనెలో చేయకూడదట. నిపుణుల ప్రకారం మాంసానికి నువ్వుల నూనె వాడొద్దు. ముల్లంగి తిన్న రోజు కూడా చేపలు తినొద్దట.
పెరుగుతో కలిపి తినకూడదు:
ఆకుకూరలు తింటున్నప్పుడు పెరుగు తినకూడదు. ఆకుకూరలు జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది. పెరుగుతో తింటే బద్ధకంగా ఉంటుంది. ఎండిన చేపలతో కూడా పెరుగు తినకూడదు.