టాలీవుడ్‌ సంచలన నిర్ణయం.. స్టార్‌ రెమ్యూనరేషన్‌లో కోత

By Aithagoni RajuFirst Published Oct 3, 2020, 11:21 PM IST
Highlights

తెలుగు చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టార్‌ హీరో, హీరోయిన్ల పారితోషికంలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది.

తెలుగు చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టార్‌ హీరో, హీరోయిన్ల పారితోషికంలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. 

మరి ఆ వివరాల్లోకి కరోనా సమయంలో, లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లు, సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. షూటింగ్‌లకు ఎప్పుడో పర్మిషన్‌ ఇవ్వగా, ఇప్పుడిప్పుడే క్రమంగా షూటింగ్‌లు ఊపందుకుంటున్నాయి. మార్చి 22న బంద్‌ అయిన థియేటర్లు ఇంకా ఓపెన్‌ కాలేదు. ఈ నెల 15 నుంచి తిరిగి ఓపెన్‌ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. యాభై శాతం సీటింగ్‌తో థియేటర్లు ఓపెన్‌ చేసుకోవచ్చని తెలిపింది. 

థియేటర్లు లేకపోవడంతో ఇటీవల `నిశ్శబ్దం` వంటి పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో విడుదలయ్యాయి. మరికొన్ని రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లకు అనుమతి ఇవ్వడం ఊరటనిచ్చే అంశం. అయితే యాభై శాతం సీటింగ్‌ అంటే కలెక్షన్లు సగానికి పడిపోతాయని వేరే చెప్పక్కర్లేదు. దీంతో భారీ బడ్జెట్‌ పెట్టిన సినిమాకి కలెక్షన్లు తగ్గడం నిర్మాతకి పెద్ద నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. 

ఈ నేపథ్యంలో తెలుగు ప్రొడ్యూసర్‌ గిల్డ్, `మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా)తో కలిసి నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాల తగ్గింపుపై ఒప్పందం కుదిరింది. లాక్‌డౌన్‌కు ముందున్న పారితోషికాల్లో 20 శాతం తగ్గింపునకు ఒప్పందం కుదిరినట్టు తెలిపింది. సినిమాకు రూ.5 లక్షలు మించి తీసుకునేవారి పారితోషికాల్లో 20 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. ఇక రోజుకు రూ.20వేలకు మించి తీసుకునేవారి పారితోషికాల్లోనూ కొంత తగ్గింపు ఉంటుందని, రోజుకు రూ.20 వేలలోపు తీసుకునే వారి పారితోషికాలు యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది. దీనికి నటీనటులు, టెక్నీషియన్లు సపోర్ట్ చేయాలని తెలిపింది. 

click me!