వైఎస్సార్సిపి సోషల్ మీడియా విభాగం దారుణంగా వ్యవహరిస్తోందని టిడిపి నాయకులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యంగా టిడిపి మహిళా నాయకులపై వారు అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
సోషల్ మీడియా ను చూసి సంతోషించాలో...బాధపడాలో అర్థం కావడం లేదని వర్ల రామయ్య అన్నారు. సోషల్ మీడియాలో తన భజన చేయించుకోడానికే ముఖ్యమంత్రి జగన్ ఏకంగా ఓ బృందాన్నే నియమించాడని ఆరోపించారు.
వైఎస్సార్సిపి నాయకులు తమకు నచ్చని వారిపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలా సోషల్ మీడియా పోస్ట్ లతో మానసికంగా వేదిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇప్పటికే టిడిపి పోలీసులకు 49 ఫిర్యాదులు అందించాం. ఒక్కదానిపై కూడా చర్య తీసుకోలేదని తెలిపారు.
ముఖ్యంగా ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి పోస్ట్ లు భరించలేని విదంగా ఉన్నాయన్నారు. అతన్ని మనిషి అని పిలవడానికి మాకు సిగ్గుగా వుందన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో అలాంటి సంస్కారహీనులు కూడా ఉంటారా..? అని అనుమానం వ్యక్తం చేశారు.
వైసిపి నేతగా చెప్పుకునే ప్రభాకర్ రెడ్డిని జగన్ కంట్రోల్ చేయాలని సూచించారు. కేవలం అతడు రెడ్డి కులానికి చెందినవాడనే చర్యలు తీసుకోవడం లేదా? రెడ్లకు వేరే కులం వారంటే అంత హినమా? అని రామయ్య ప్రశ్నించారు.
టిడిపి బిసి మహిళా పంచుమర్తి అనురాధ పై బయటకు చెప్పలేని విధంగా పోస్ట్ లు పెట్టారన్నారు. తక్షణమే ప్రభాకర్ రెడ్డి ని అరెస్ట్ చేయాలని రామయ్య డిమాండ్ చేశారు.