రాజధానిపై స్టేటస్ కో కొనసాగింపు... ఆ వివరాలు సీల్డ్ కవర్లో: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

By Arun Kumar PFirst Published Oct 6, 2020, 1:23 PM IST
Highlights

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగనున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించి దాఖలయిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగనున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది తదుపరి విచారణ వరకు అమల్లో వుంటుందని హైకోర్టు ప్రకటించింది. 

ఇక రాజధాని బిల్లులపై జనవరిలో జరిగిన మండలి చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను సీడీలు, సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. విశాఖలో అతిథిగృహం నిర్మాణంపై ఉన్న పిటిషన్‌ను ఈనెల 9న వింటామని కోర్టు తెలిపింది.  అనుబంధ పిటిషన్లపై విచారణను ఈనెల తొమ్మిదికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. 

read more   8 మాసాల తర్వాత మోడీతో జగన్ భేటీ: కీలకాంశాలపై చర్చ

రాజధాని వివాదంపై అమరావతి రైతులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే విశాఖలో గెస్ట్ హౌజ్ నిర్మాణంపై సీఎస్ ను కౌంటర్ ధాఖలు చేయమని గతంలో ధర్మాసనం ఆదేశించింది. రాజధాని నుంచి కార్యాలయాల తరలింపు, హైకోర్టుకు శాశ్వత భవన నిర్మాణం, సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్-5 జోన్ పిటిషన్ తో పాటు పలు అంశాలపై దాఖలైన పిటిషన్ల విచారణ జరిపింది హైకోర్టు. 

ఇప్పటికే జగన్ సర్కార్ ఆగస్ట్ 16వ తేదీన విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం సైతం పంపారు. నేరుగా రావడానికి కుదరకపోతే కనీసం వర్చువల్ గా అయినా శంకుస్థాపన చేయాలని కోరారు. కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి ముహుర్తాన్ని దసరాకి వాయిదా వేశారు. ప్రధాని అపాయింట్మెంట్ కుదరక అని చెప్పినప్పటికీ... న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయో లేవో అనే ఒక అనుమానం కూడా జగన్ సర్కార్ మనసులో ఉండే వాయిదా వేసినట్టుగా వార్తలు వచ్చాయి. 

మరోపక్క జగన్ సర్కార్ సాధ్యమైనంత త్వరగా కోర్టులో ఈ విషయానికి శుభం కార్డు వేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. రైతులకు అమరావతిలో ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసి ఇస్తామో చెప్పే ఒక ప్లాన్ ను రూపొందిస్తుంది. అభివృద్ధి ఎలా చేయబోతున్నామో చెబుతూ... ఈ పూర్తి విషయాన్నీ కోర్టు ముందు ప్రభుత్వం  ఉంచాలనుకుంటుందని సమాచారం.

ఇలా కోర్టుకు సమర్పించడం ద్వారా మౌలికంగా రైతులు తమకు అన్యాయం జరిగిందని చెబుతున్న వాదనకు....  ప్రభుత్వం ఈ ప్లాన్ ద్వారా వారికి నష్టం కలగకుండా చూస్తామని కోర్టుకు చెప్పొచ్చని భావిస్తోంది. కోర్టు గనుక ప్రభుత్వ వాదనకు అంగీకరిస్తే ఈ వివాదానికి శుభం కార్డు వేయొచ్చు అని భావిస్తుంది. 


 

 

click me!