వేద యూనివర్శిటీని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
గుంటూరు: 2050 నాటికి ప్రపంచంలోనే ఆంద్రప్రదేశ్ అన్ని రంగాల్లో బెస్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్ర రాజధానిలో నివాసం ఉంటే మరో పదేళ్ళపాటు ఆయువు పెరిగేలా సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో మరో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. సెమీ కండక్టర్ల తయారీలో పేరుగాంచిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇన్వెకాస్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గుంటూరు జిల్లా విద్యానగర్లో సీఎం చంద్రబాబు శుక్రవారం ఇన్వెకాస్ -వేద సంస్థను ప్రారంభించారు
ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు అమరావతికి క్యూ కడుతున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్ర విభజనతో కష్టనష్టాలతోనే రాష్ట్రంలో పాలన ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఏపీ టాప్గా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వంద ఫోన్లు తయారైతే అందులో ఏపీలో తయారైన ఫోన్లే 50 వరకు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. సెల్ఫోన్ల ఉత్పత్తులు గణనీయంగా పెరిగినట్టు ఆయన చెప్పారు.
2029 నాటికి దేశాన్ని రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా అగ్రగామిగా నిలపనున్నట్టు చెప్పారు. అభివృద్ధిలోనే కాదు హ్యపీనెస్ ఇండెక్స్లో కూడ ఏపీ రాష్ట్రం ముందుండేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది హ్యపీనెస్ ఇండెక్స్ లో ఏపీ రాష్ట్రం 44వ, స్థానంలో ఉందన్నారు.
అమరావతిలో జీవన ప్రమాణాలను కూడ మెరుగుపర్చేలా ప్లాన్ చేస్తున్నామని ఆయన చెప్పారు. అన్ని రకాల సదుపాయాలతో పాటు ఇక్కడ జీవిస్తే మనిషి ఆయువు మరో పదేళ్ళు పెరిగేలా ప్లాన్ చేస్తున్నట్టు చంద్రబాబునాయుడు తెలిపారు. నాలెడ్జ్ను ఐటీతో అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కాలంలో హైద్రాబాద్, సికింద్రబాద్తో పాటు సైబరాబాద్ నగరాన్ని నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ అనుభవంతో ఏపీలో కూడ అమరావతి నగరాన్ని ప్రపంచంలోనే బెస్ట్ నగరంగా నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు.