ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కవితం అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కవిత మాటలు వింటుంటే సొంత అన్నపైనే తిరుగుబాటు మొదలు పెట్టినట్లు స్పష్టమవుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్నారని మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో, ఆమె మరోసారి మీడియా ప్రతినిధులతో ముఖాముఖి చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలతో క్లారిటీ ఇచ్చారు.
తాను పార్టీకి వేరే జెండా లేదా అజెండాతో రాలేదని, బీఆర్ఎస్ను కాపాడుకోవడమే తనకు ప్రాధాన్యమని తెలిపారు. తాను రాసిన లేఖను ఎవరు బయటకు లీక్ చేశారన్నదే ప్రధాన ప్రశ్న అని అన్నారు. ఆ లేఖ వెనక ఉన్న మర్మం బయటకు రావాలన్నది ఆమె అభిమతం అని తేల్చి చెప్పింది.
తన దృష్టిలో బీఆర్ఎస్కు కేసీఆర్ ఒక్కడే నాయకుడని కవిత తేల్చి చెప్పారు. ‘‘పెద్దాయనపై ఎవరు విమర్శలు చేసినా ఊరుకోను. అనేక బాధల మధ్యనే పార్టీ భవిష్యత్తు కోసమే లేఖ రాశా’’ని చెప్పారు. ఇది వ్యక్తిగతంగా ఏదో సాధించాలనే ప్రయత్నం కాదని స్పష్టం చేశారు.
భాగ్యరెడ్డి వర్మ, పీవీ నరసింహరావు వర్ధంతి సభలను జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించామని, అప్పట్లో సింగరేణిలో కొత్త నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాడిన విషయాలను గుర్తు చేశారు. యువతకు అవకాశాలు కల్పించేందుకు జాగృతి ఎలా సహకరించిందో వివరించారు. సింగరేణి వారసత్వ నియామకాల్లో యువతకు ప్రాధాన్యత దక్కిందంటే అది కేసీఆర్ సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు.
బీజేపీపై విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన నోటీసుల నేపథ్యంలో, ఎందుకు పార్టీ ముఖ్య నాయకులు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. ‘‘లేఖలో పేర్కొన్న అంశాలు ప్రజల హృదయాల్లో ఉన్నవే. అవి కొత్తవేమీ కావు,’’ అని అన్నారు. బీజేపీతో బంధం పార్టీకి మేలు చేయదని అభిప్రాయపడ్డారు.
జైల్లో ఉన్న సమయంలోనే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని ప్రచారం జరిగిందని, కానీ తాను అప్పుడే దీనికి తిరస్కరించారనని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని కాకుండా ప్రజల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అని పేర్కొన్నారు. ‘‘నేను లేఖ రాయడంలో తప్పేమీ చేయలేదు’’ అని తెలిపారు.