IND vs AUS Final: వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. సొంత గడ్డపై టీమిండియా మట్టి కరిపించి.. ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టీమిండియా కప్ గెలువకపోయినా.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు మన ఆటగాడినే వరించింది. ఆ ఆటగాడు ఎవరో కాదు కింగ్ కోహ్లీ. అదే సమయంలో మరో రికార్డు క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ రికార్డేంటంటే..? 

IND vs AUS Final: ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఓడిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా కప్ గెలువకపోయినా.. ఆ అరుదైన గౌరవం మనోడికే దక్కింది. 

ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది. ఈ మెగా టోర్నీలో ఆడిన 11 మ్యాచుల్లో విరాట్‌ కోహ్లీ 95.62 సగటుతో మొత్తం 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇందులో 9 సార్లు 50 ప్లస్ పరుగులు ఉండటం మరో రికారు.

అలాగే.. ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అదే సమయంలో కోహ్లి వరుసగా ఐదుసార్లు 50+ స్కోర్లు సాధించిన రికార్డును తన పేరున నమోదు చేసుకున్నాడు. ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న భారత్ నుంచి కోహ్లీ మూడో ఆటగాడు. అంతకు ముందు 2003లో సచిన్ టెండూల్కర్, 2011లో యువరాజ్ సింగ్ ఈ అవార్డును గెలుచుకున్నారు. 

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ ఎవరంటే..? 

అదే సమయంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ట్రావిస్ హెడ్ నిలిచారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. 47 పరుగులకే మూడు వికెట్లు పడిపోయిన తర్వాత ట్రావిస్ హెడ్ మార్నస్ లాబుస్చాగ్నేతో కలిసి 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్ మరియు ఫైనల్ రెండింటిలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మొహిందర్ అమర్‌నాథ్ (1983), అరవింద డి సిల్వా (1996), షేన్ వార్న్ (1999) తర్వాత ట్రావిస్ హెడ్ నాల్గవ ఆటగాడిగా నిలిచాడు.