పాలేరు నుంచే పోటీ చేస్తున్నా .. ఆశీర్వదించండి : ప్రజలను కోరిన వైఎస్ షర్మిల
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. మాట కోసం నిలబడే నిజాయితీ, సేవ చేయాలన్న తపన వుందని ఆమె పేర్కొన్నారు.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శుక్రవారం పాలేరు నియోజకవర్గానికి సంబంధించి నూతన కార్యాలయ నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పాలేరు ప్రజల హక్కుల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. మాట కోసం నిలబడే నిజాయితీ, సేవ చేయాలన్న తపన వుందని షర్మిల అన్నారు. వైఎస్ పాలనను ఆదర్శంగా తీసుకుని కొనసాగుతామని... వ్యవసాయం పండగ చేసేలా పాలన సాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచిన వైఎస్ బిడ్డను ఆశీర్వదించాలని కోరారు.
కాగా.. వచ్చే ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తామని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల గతంలోనే ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాలేరులో వైఎస్ఆర్ టీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు.
ALso REad:వైఎస్ఆర్టీపీ కార్యాలయానికి భూమి పూజ: పాలేరు నుండి పోటీకి షర్మిల ప్లాన్
ప్రస్తుతం పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కందాళ ఉపేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల సమంలో కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి అప్పటి మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వర్ రావుపై విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఉపేందర్ రెడ్డి బీఆర్ ఎస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరర్ రావు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సిట్టింగ్ లకే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ గత నెలలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాలేరు నుండి టికెట్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.