సారాంశం
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్లో విలీనంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విధించిన డెడ్లైన్ (సెప్టెంబర్ 30) కూడా ముగిసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం ఉంటుందా? లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఆఫర్లు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానంలో షర్మిలకు టికెట్ ఇవ్వడంతో పాటుగా.. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని కూడా ఆ పార్టీ అధిష్టానం ఆఫర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
వైఎస్సార్టీపీ వర్గాల్లో కూడా ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. ఇక, కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు షర్మిల రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నట్టుగా సమాచారం. అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం తర్వాత కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక, వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసినప్పటీ నుంచి ఆమె పాలేరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెబుతూ వస్తున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కీలక నేతలు హస్తం గూటికి చేరడంతో.. పాలేరు టికెట్ను షర్మిలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా లేదని తెలుస్తోంది. అయితే ఖమ్మం లోక్సభ టికెట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇందుకు షర్మిల కూడా అంగీకరించినట్టుగా సమాచారం.