పోలీసు శాఖపై కేసు వేయాలని నిర్ణయం తీసుకున్నాం.. సంక్రాంతి తర్వాతే పాదయాత్ర: వైఎస్ షర్మిల
తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా కేసీఆర్ చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు.
తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా కేసీఆర్ చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. పోలీసుల భుజాన తుపాకులు పెట్టి సీఎం కేసీఆర్ తమను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన అమరణ దీక్షను భగ్నం చేశారని.. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను కూడా ఆఫీసుకు రానీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కనీసం మీడియాను కూడా అనుమతించే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు.
హైదరాబాద్లో వైఎస్ షర్మిల ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పని అయిపోయిందని ఇప్పుడు కేసీఆర్ బందిపోట్ల రాష్ట్ర సమితి పేరుతో దేశం మీద పడ్డారని షర్మిల అన్నారు. పోలీసులను కీలుబొమ్మలా వాడుకుంటున్న సీఎం కేసీఆర్.. తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఎంత సహనంతో ఉన్న తమపై వేధింపులు ఆగడం లేదని అన్నారు. హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేసేందుకు లాయర్తో కలిసి బయలుదేరితే కూడా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.
కుటుంబపరంగా ఉన్న పనులను కూడా చేసుకోవనివ్వడం లేదని అన్నారు. పోలీసులు తన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయిందని.. అందుకే పోలీస్ శాఖపై కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఇక, తన పాదయాత్రను తిరిగి ప్రారంభించడంపై స్పందించిన వైఎస్ షర్మిల.. ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు యాత్ర కొనసాగించలేకపోతున్నాని చెప్పారు. సంక్రాంతి తర్వాత పాదయాత్రను కొనసాగిస్తానని చెప్పారు. హైకోర్టు తమ పాదయాత్రకు అనుమతించిందని.. ఇప్పటికైనా తన పాదయాత్రకు కేసీఆర్ అనుమతించాలని షర్మిల డిమాండ్ చేశారు.