అపోలో ఆస్పత్రి నుంచి వైఎస్ షర్మిల డిశ్చార్జ్..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వైఎస్ షర్మిల.. నేరుగా లోటస్ పాండ్లోని తన నివాసానికి చేరుకున్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వైఎస్ షర్మిల.. నేరుగా లోటస్ పాండ్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆమెకు 15 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో షర్మిల ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక, తన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం నుంచి షర్మిల నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. షర్మిల దీక్షను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్లోని షర్మిల ఇంటి వద్ద ఉన్నఆమె దీక్ష శిబిరంలోకి ప్రవేశించిన పోలీసులు అరెస్ట్ చేసి అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఇక, ఆదివారం విడుదల చేసిన వైద్యులు.. షర్మిల రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని చెప్పారు. డీహైడ్రేషన్ ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుందన.. ఇది ఆమె మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు తెలిపారు. అయితే సోమవారం ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్టుగా చెప్పారు. షర్మిల పూర్తిగా కోలుకునేందుకు రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.
అయితే ఆస్పత్రి బెడ్ నుంచే వైఎస్ షర్మిల ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వైఎస్సార్ బిడ్డను బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం కేసీఆర్ తరం కాదని అన్నారు. ‘‘గౌరవ హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా.. కేసీఆర్ మాత్రం పోలీసు భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారు.ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను, మా కార్యకర్తలను బందీలను చేశారు. తీవ్రంగా కొట్టారు.అకారణంగా కర్ఫ్యూ విధించారు. ఇవన్నీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారు.
మీ త్యాగాలను వైఎస్సార్ బిడ్డ ఎన్నటికీ మరవదు. వైఎస్సార్పై మీకున్న అభిమానాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారు. వైఎస్సార్ బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం కేసీఆర్ తరం కాదు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రజలకు అందించే వరకు ఈ పోరాటం ఆగదు’’ అని షర్మిల పేర్కొన్నారు.