ఎక్కడపడితే అక్కడ పట్టుకున్నారు, ప్రశ్నిస్తే అరెస్టులా: షర్మిల అరెస్ట్ పై వైఎస్ విజయమ్మ
ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసి ప్రభుత్వం తమకు ఎదురు లేకుండా చేసుకుంటుందని వైఎస్ విజయమ్మ ఆరోపించారు. వైఎస్ షర్మిల అరెస్ట్ పై ఆమె స్పందించారు.
![YS Vijayamma Responds on YSRTP Chief YS Sharmila Arrest lns YS Vijayamma Responds on YSRTP Chief YS Sharmila Arrest lns](https://static-ai.asianetnews.com/images/c5ace001-4bd1-4cf2-8ef1-ebd8cf4d0ba7/image_363x203xt.jpg)
హైదరాబాద్: ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని వైఎస్ విజయమ్మ చెప్పారు. వైఎస్ షర్మిల అరెస్ట్ ను ఆమె తప్పుబట్టారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ఆమె ప్రశ్నించారు.
సోమవారంనాడు మధ్యాహ్నం లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడారు. సాం కార్యాలయానికి షర్మిల వెళ్తే తప్పు ఏమిటని ఆమె ప్రశ్నించారు. పోలీసులు ఎక్కడబడితే అక్కడ పట్టుకుంటున్నారని వైఎస్ విజయమ్మ ఆరోపించారు.
షర్మిల ఉద్యమకారిణికాదు, టెర్రరిస్టు కూడా కాదని చెప్పారు. షర్మిల వేలమందితో వెళ్లలేదు కదా అని ఆమె ప్రశ్నించారు. పోలీసులు మీద మీద పడుతుంటే ఆవేశం రాదా అని విజయమ్మ ప్రశ్నించారు. తాను పోలీసులను ఇష్టారీతిలో కొట్టినట్టుగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని విజయమ్మ చెప్పారు. తాను కొట్టాలనుకొంటే గట్టిగానే కొట్టేదన్నాన్నారు. తనపై పోలీసులు మీద పడిపోతే వారిని నెట్టివేసినట్టుగా విజయమ్మ చెప్పారు.
వాస్తవాలను ప్రజలకు తెలపాలని ఆమె మీడియాను కోరారు. ప్రజల కోసం మీరు కూడా పోరాటం చేయాలని ఆమె మీడియాను కోరారు. మహిళా పోలీసులు అంతమంది వచ్చి తన మీద పడితే ఆవేశం వచ్చిందని విజయమ్మ చెప్పారు. షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.షర్మిల బయటకు ఎక్కడికి వెళ్లకూడదా అని విజయమ్మ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎవరూ కూడా విమర్శించకూడదా అని ఆమె అడిగారు. షర్మిల డ్రైవర్ పై కూడా దాడి చేశారని విజయమ్మ ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వద్ద మీడియాపై కూడా పోలీసులు దాడి చేశారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం షర్మిల పార్టీ పెట్టిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని షర్మిల పోరాటం చేస్తుందన్నారు.