డబుల్ బెడ్రూమ్లు కూలుతున్నాయ్.. పేదలకు అందాలంటే ఎన్నికలు రావాలా: కేసీఆర్పై షర్మిల విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. ఓ దినపత్రికలో 'ఇండ్లియ్యరాయె' పేరుతో ప్రచురితమైన ఓ కథనాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆమె విమర్శలు గుప్పించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. ఓ దినపత్రికలో 'ఇండ్లియ్యరాయె' పేరుతో ప్రచురితమైన ఓ కథనాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. గ్రేటర్ హైదరాబాదుతో కలిపి దాదాపు మూడు లక్షల ఇళ్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరేళ్లలో కట్టిన ఇళ్లు కేవలం లక్షలోపేనని, వాటిని సైతం లబ్ధిదారులకు కేటాయించడంలో తెలంగాణ సర్కార్ తీవ్ర జాప్యం చేస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు.
పలు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తయ్యి ఏడాది, రెండేళ్లు గడుస్తున్నా కేటాయించకపోవడంతో మెయింటెనెన్స్ లేక దెబ్బతింటున్నాయని ఆమె వివరించారు. అలాగే, నాగర్ కర్నూల్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఈ అంశాలను షర్మిల ప్రస్తావించారు.
'3 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడుతమని.. చెప్పి 6 ఏండ్లయినా లక్ష కూడా కట్టలే, ఇచ్చినవి వేలల్లో కూడా లేవు, ఒకవైపు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూలిపోతున్నా.. లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నా.. పేదలకు ఇండ్లు ఇచ్చింది లేదు, ఆత్మగౌరవ ఇండ్లు పేదలకు అందాలంటే ఎన్నికలు రావాలా?.. కేసీఆర్ దొర' అని షర్మిల ప్రశ్నించారు