వైఎస్ఆర్ అభిమానులతోసమావేశం: అందరి చూపు షర్మిల వైపే
వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల లోటస్పాండ్ లో మంగళవారం నాడు సమావేశాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల లోటస్పాండ్ లో మంగళవారం నాడు సమావేశాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పలువురు వైఎస్ఆర్ అభిమానులు లోటస్ పాండ్ కు చేరుకొన్నారు. షర్మిల రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారనే ఊహగానాలు వెలువుడుతున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.
వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఎంపిక చేసిన పలువురికి షర్మిల కార్యాలయం నుండి ఫోన్లు వెళ్లాయి. ఈ ఆహ్వానం అందుకొన్న పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మీడియా ద్వారా ఈ సమావేశం గురించి తెలుసుకొని లోటస్ పాండ్ వద్దకు చేరుకొన్న వైఎస్ఆర్ అభిమానులను అనుమతి ఇవ్వలేదు.ఆహ్వానం అందిన నేతలకు మాత్రమే కార్యాలయం లోపలికి అనుమతించారు. మరోవైపు లోటస్ పాండ్ వద్ద షర్మిల సమావేశానికి సంబంధించి భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు పలు జిల్లాల నుండి వైఎస్ఆర్ అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత లోటస్ పాండ్ వద్దకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి షర్మిల మాట్లాడే అవకాశం ఉంది.