ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుండి మరో లెక్క: జగన్పై షర్మిల పరోక్ష విమర్శలు
వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గం తొలి సమావేశం గురువారం నాడు లోటస్పాండ్లో జరిగింది. తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులను పట్టించుకోలేదని జగన్ పై షర్మిల పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులను గాలికొదిలేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరోక్ష విమర్శలు చేశారు.గురువారం నాడు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గం తొలి సమావేశం హైద్రాబాద్ లోటస్పాండ్ లో జరిగింది. తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులను పట్టించుకొన్న పాపానపోలేదన్నారు. వైఎస్ కుటుంబం కోసం తెలంగాణకు చెందిన ఆయన అభిమానులు ఎంతో చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. తమ స్వంత డబ్బులను కూడ ఖర్చు చేసుకొన్నారన్నారు.
ఇంత చేసినా కూడ తెలంగాణ వైఎస్ఆర్ అభిమానులకు గుర్తింపు దక్కలేదన్నారు. అయినా వారంతా వైఎస్ఆర్ ను తమ గుండెల్లో పెట్టుకొన్నారని చెప్పారు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క.. మన కష్టం మనది, మన ఫలితం మనది.. మన గౌరవం మనది, మన పోరాటం మన కోసమని ఆమె చెప్పారు.
తెలంగాణ ప్రజల కోసం తాను అండగా ఉంటానని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ అభిమానులకు కూడ నిలబెడతానని ఆమె చెప్పారు. రాజన్న ఆశయాలు మన పార్టీతోనే సాధ్యమన్నారు.తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. జిల్లాలవారీగా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించాలని షర్మిల పార్టీ నిర్ణయం తీసుకొంది.